ఉపాధి కోల్పోయిన వాయిద్య కళాకారులు
నగరంలోనే సుమారు 10 వేల మంది..
అద్దెలు కట్టలేక అల్లాడుతున్న నాయీ బ్రాహ్మణులు
హైదరాబాద్: లాక్డౌన్ ప్రభావం రాష్ట్రంలోని రెండు లక్షల మంది సన్నా యి, మంగళవాయిద్య కళాకారులపై ప్రత్యక్షంగా, వారిపై ఆధార పడిన ఆరు లక్షల మందిపై పరోక్షంగా పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎనిమిది లక్షల మంది జీవనోపాధి కరువై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క నగరంలోనే సుమారు పది వేల మంది వరకు సన్నాయి, డోలు వాయ్యిద కళాకారు లు ఉన్నారు. వారిలో చాలా మంది ఉన్నత చదువులు చదివి నా, కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు రద్దయ్యాయి. దీంతో పనులు లేక ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. పూట గడవకపోవడంతో వడ్డీలకు అప్పులు తీసుకుని బతుకుబండిని లాగిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని తాము ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, నిత్యావసర సరుకులను కొనుగోలు చేయలేక సతమతమవుతున్నామని వారు వాపోతున్నారు.
కత్తెర పడితేనే కడుపు నిండేది..
లాక్డౌన్ వల్ల నగరంలోని కొన్ని నాయీ బ్రాహ్మణ కుటుంబాలు ఆకలితో అల్లాడిపోతున్నాయి. కత్తెర పడితే కానీ తమ కడుపు నిండదని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షాపులు మూసి ఉంచడంతో ఉపాధి పోయిందని, అప్పులు చేసి షాపులు ఏర్పాటు చేసుకున్న వారు వడ్డీల భారం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపుల అద్దెతో పాటు ఇంటి అద్దె, నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని చెబుతున్నారు. తమను ఎవరూ ఆదుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు కాస్త వెసులుబాటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు కోరుతున్నారు.
ఆదుకోవాలి
మంగళవాయిద్య కళాకారులను ప్రభుత్వాలతోపాటు దాత లూ ఆదుకోవాలి. మంగళవాయిద్య కళాకారులను ఆదుకోదలచిన దాతలు, అధికారులు 93911 61202 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరని మనవి.
-తులసీదాస్, అధ్యక్షుడు, తెలంగాణ మంగళవాయిద్య కళాకారుల సంఘం
పస్తులుండాల్సి వస్తుంది..
లాక్డౌన్లో షాపు మూత పడింది. పనిలేక పోవడంతో కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. షాపులు తెరిచేందుకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పించి, ఆదుకోవాలి.
– పోచయ్య, బార్బర్
Courtesy Andhrajyothy