కోయంబత్తూర్ : ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు, ప్రముఖ రచయిత ఇ.వి.రామ స్వామి విగ్రహానికి అవమానం జరిగింది. కొయం బత్తూరులోని సుందర పురంలో ఉన్న పెరియార్ విగ్రహానికి దుండగులు కాషాయ రంగు పులిమారు. పోలీసుల కథనం ప్రకారం విగ్రహం వద్ద భద్రత కోసం నియమించిన ఇద్దరు పోలీసులు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వర్షం కురవడంతో పక్కకు వెళ్లారని, ఆసమయంలో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సిసిటివి ఫుటేజ్ల సహాయంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పెరియార్ అభిమానులు తీవ్ర ఆహ్రం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. 25 ఏళ్ల క్రితం ద్రవిడ కజగం అధ్యక్షులు కె వీరమణి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
స్టాలిన్ ఖండన
పెరియార్ విగ్రహాన్ని కళంకపరచడాన్ని డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్, తూత్తుకుడి ఎంపి కనిమెళి తీవ్రంగా ఖండించారు. తనపై విమర్శలు చేసిన వారి సంక్షేమం కోసం కూడా పనిచేసిన వ్యక్తి పెరియార్ అని స్టాలిన్ పేర్కొన్నారు.
‘తనపై చెప్పులు విసిరిన చోట తన విగ్రహాలు నిర్మించమని పెరియార్ చెప్పారు. తన బొమ్మలు దగ్ధం చేయాలనుకున్న వారికి తన ఫోటోలు, తనను విమర్శించాలనుకున్న వారికి పెన్నులు అందచేసిన వ్యక్తి పెరియార్. అందుకే ఆయన పెరియార్ అయ్యారు’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. కొన్ని దశాబ్ధాల తరువాత కూడా పెరియార్ మార్గదర్శకుడిగా నిలిచారని కనిమొళి ట్వీట్ చేశారు.
Courtesy Prajasakti