ఆనంద్ పన్నెండేళ్ళ పిల్లవాడు. ఎపుడూ అల్లరి చేస్తూ హుషారుగా ఉండేవాడు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం మొదలెట్టాడు. వాడికి లోపల ఏదో తెలియని బాధ. స్కూలు లేదు. ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. టీవీల్లో కరోనా వార్తలు తప్ప మరో అంశమూ లేదు. కరోనా కాలంలో ఇంటి నుంచే పని చేసుకునే అతడి తండ్రి ఇరవై నాలుగ్గంటలూ వార్తలు వింటూనే ఉంటాడు. టీవీల్లో ”మృత్యు ఘంటికలు”, ”మరణ మృదంగం” వంటి పదాలకు అర్థాలు చాలా భయంకరమైనవని వాడికి ఇపుడిపుడే తెలుస్తోంది. కొందరు తెల్లటి ముసుగుల్లాంటి దుస్తులలో తిరుగుతూ కనిపించే దృశ్యాలూ, బ్లర్ చేయబడిన శరీరాల్ని స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్న దృశ్యాలూ, వారి చుట్టూ బోరున విలపిస్తున్న మరికొందరూ… వాటినన్నింటినీ చూస్తూ ”జీవితం భయంకరంగా తయారైంద”ని అమ్మతో అంటున్న నాన్న. భయమేస్తుందంటూ అందరికీ ఫోన్లు చేస్తూ ఇరవై నాలుగ్గంటలూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఆందోళనలో అమ్మ.
ఇంతలో బంధువులలో ఎవరో కరోనా బారిన పడి మరణించారనే వార్త తెలియగానే బోరున విలపిస్తున్న వాడి తల్లిదండ్రులు. తలుపులూ కిటికీలూ వేసుకుని భయం భయంగా బతికేస్తున్న తమ కుటుంబం. వాడికి ఇవేవీ అర్థం కావడం లేదు గానీ జీవితం మాత్రం ఏదో భయంకరమైన స్థితిలో ఉందని అర్థమౌతుంది. వాడికి రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. భయంకరమైన కలలు వస్తున్నాయి. రోజురోజుకీ వాడిలో భయం మరింత పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. స్కూలూ ఆటలూ పాటలూ స్నేహితులూ ముచ్చట్లూ చాక్లెట్లూ అన్నీ దూరమైనాయి. వాడు అసలు ఇంట్లో ఉన్నాడనే స్పృహ లేదు ఎవరికీ. వాడి చిన్న హృదయం మీద కరోనా పాండెమిక్ సృష్టించిన భయోత్పాతం ఎంత పెద్దదో ఎవరూ ఊహించలేరు. తెలియకుండానే వాడు మౌనంగా రోదిస్తున్నాడు. ప్రతిరోజూ… ప్రతీ క్షణం… ఇంటి ముందు స్నేహితులతో ఆడుకునే స్థలాల్లో ఖాళీలను కిటికీల్లోంచి చూస్తూ ఖాళీగా నిలబడి పోతున్నాడు. ఇది ఒక్క ఆనంద్ కథ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రతీ ఇంటిలో ఉన్న చిన్న పిల్లల కథ.
కరోనా పాండమిక్లో ఉన్న ఏకైక మంచి అంశం ఏంటంటే అది పిల్లలలో పెద్దగా ప్రభావం చూపకపోవడమని చాలా మంది సంబర పడిపోతుంటారు. కానీ కరోనా పాండమిక్ అందరికంటే ఎక్కువగా పిల్లల మీదే ప్రభావం చూపుతోందని దాదాపు ఎవరూ గుర్తించడమే లేదు. ఐతే పిల్లల శరీరం మీద కాదు, మనసు మీద. మరణాలనీ, ఏడుపులనీ,భయానక విశేషణాలతో ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో సహా మసాలా దట్టించి మరణ వార్తలను అమ్ముకుంటున్న వార్తా వ్యాపారాన్ని తెలిసో తెలీకుండో చూస్తూ మానసికంగా క్రుంగిపోతున్నారు పిల్లలు. ముఖ్యంగా లాక్డౌన్, ఆ తరువాత పరిణామాలు చాలా ఇళ్ళల్లో గృహహింస పెరగటానికి దోహదం చేస్తే ఆ తల్లిదండ్రుల గొడవల మధ్యన చిక్కుకుని నలిగి పోతున్నారు చిన్నారులు.
ప్రపంచమంటే జీవితమంటే పూర్తిగా అవగాహనకు రాకముందే సమీప భవిష్యత్తు పట్లే పూర్తి అపనమ్మకాన్నీ అనిశ్చితినీ మూటగట్టుకుని బిత్తర చూపులు చూస్తున్నారు పిల్లలు. నిజానికి ఈ పాండమిక్లో అసలైన విక్టిమ్స్ పిల్లలే. ఎందుకంటే ఈ భయానక వాతావరణం వాళ్ళలో కోలుకోలేని మానసిక ఒత్తిడిని కలిగించబోతోందేమోననే స్పృహ చైల్డ్ సైకాలజిస్ట్ లలో వ్యక్తమౌతోంది. ఇంట్లో తాతయ్య నానమ్మలు అనారోగ్యం పాలైతే, ఇంతకాలం వారితో కథలు చెప్పించుకుని ఆడుకునే పిల్లలు మరింత కృంగిపోతున్నారు. ఇక ఆ పెద్దవాళ్ళే కరోనాతో మరణిస్తే, కనీసం వాళ్ళ చివరి చూపుకూడా నోచుకోని పిల్లలు ఎంతటి క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకోవచ్చు. తల్లో లేక తండ్రో home quarentine లో రెండు మూడు నాలుగు వారాలు పిల్లలకు దూరంగా ఉండటం కూడా వారిని కృంగదీస్తుంది.
కరోనా కాలంలో లోకం గురించి కొంత ఆలోచించగలిగే వయసుగల ఆనంద్ లాంటి పిల్లలలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటే, మూడు నుంచి ఆరేళ్ళలోపు పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ వయసు పిల్లలు తమ భావాలను చెప్పలేరు. కాబట్టి తమ ప్రవర్తనలో దాన్ని ఏదో రూపంలో చూపుతుంటారు. బాగా హఠం చేస్తుంటారు. ఇర్రిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపోరు. పిల్లల ఈ ప్రవర్తనకు కారణం అర్థం చేసుకోక వారిలో అల్లరి ఎక్కువైందని, మొండితనం ఎక్కువైందనీ వారిని మరింత హింసకు గురి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. బాలల మీద హింస అలా తెలియకుండానే పెరిగిపోతోంది. ”ఇంట్లో పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం, ఈ స్కూళ్ళు ఎపుడు తెరుస్తారో ఏమో” అంటూ వారిని మరింత బెదిరించే వాళ్ళే ఎక్కువ. నిజంగా స్కూళ్ళు తెరవనందుకు పేరెంట్స్కి కలిగే మానసిక ఒత్తిడికంటే కంటే పిల్లలలో కలిగే మానసిక ఒత్తిడే ఎక్కువ. చాలామంది పిల్లలకు గృహ హింసను తప్పించుకోవడానికి స్కూలు ఒక మంచి ప్రదేశం. కానీ ఈ రోజు తప్పనిసరై గృహహింసకు లోనౌతున్నారు.
కరోనా పాండెమిక్ సమయంలో టీవీల ముందు వార్తలతో గడపడం కంటే పిలల్లతో గడపడం చాలా అవసరం. వారి సైకలాజికల్ స్ట్రెస్ను మొదటి దశలోనే గుర్తించి తగ్గించగలగడం అవసరం. ఎవరైనా చిన్నపిల్లలు కరోనా గురించి ప్రశ్నలు వేయడం మొదలెట్టా రంటేనే వారిలో దానికి సంబంధించిన స్ట్రెస్ మొదలైందని అర్థం చేసుకోవాలి. వారిని ఇక ఆ వాతావరణం నుంచి దూరం చేయగలగాలి. నిద్రలేమినీ, ఆకలి తగ్గడాన్నీ, కోపమూ, మొండితనం పెరగడాన్నీ అంతటినీ ”అల్లరి” కింద జమకట్టకూడదు. ఆన్లైన్ క్లాసులు నిజంగా వారిని కరోనా సంబంధిత సమాచారం నుంచి దూరంగా ఉంచగలిగి వారిని వాళ్ళ రొటీన్ జీవన శైలిలోకి తీసుకుపోగలుగుతున్నాయా లేక అప్పటికే భయం గుప్పిట్లోకి పోయిన పిల్లవాణ్ణి మరింత భయపెడుతున్నాయా అన్నది తల్లిదండ్రులే గమనించుకోవాలి.
విపరీతమైన స్ట్రెస్లో ఉన్న పిల్లలు ఆన్లైన్ క్లాసులలో సరిగా శ్రద్ధ చూపలేరు. చదవలేరు. అందుకని వాళ్ళని మరింత నిందిస్తూ చదువులో వెనకబడిపోతారేమోననే ఆందోళనతో చదవాల్సిందేనని మరింత బలపెడుతూ ఉంటారు. ఇత్యాదివి ప్రమాదకరం. వాళ్ళ ఆకలి నిద్ర వంటి వాటిమీద పూర్తి ధ్యాస ఉంచాలి. ఆటలు లేకపోతే పిల్లలకు శారీరక శ్రమ ఉండదు. మానసికోల్లాసమూ ఉండదు. పిల్లలకు ఆటల వాతావరణాన్ని తల్లిదండ్రులే ఇంట్లో కలిగించగలగాలి. టీవీ వార్తలూ, ఆన్లైన్ క్లాసులూ వారిని ఆనంద పరుస్తున్నాయా లేక బెంబేలెత్తిస్తున్నాయా? అనేది తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. తల్లి లేక తండ్రిలో ఏ ఒక్కరు home isolationలో ఉన్నా మరొకరు ఆ పిల్లలకు మరింత ధైర్యాన్ని ఇవ్వగలగాలి. సింగిల్ పేరెంట్ పిల్లలుంటే ఆ పేరెంట్ క్వారంటైన్లో ఉంటే ఆ సమయంలో ఆ పిల్లలకు ధైర్యం చెప్పవలసిన బాధ్యత ఆ పేరెంట్ మీదే ఉంటుంది. అటువంటి పేరెంట్ ఉంటే ఆమె లేదా అతడి బంధువులు వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వగలగాలి.
కరోనా పాండెమిక్ ఈ రోజు కాకుంటే రేపు తగ్గిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రపంచం పట్ల పిల్లలలో అది కలిగించిన దృక్పథం మాత్రం వాళ్ళ జీవితాంతం వేటాడబోతోందనిపిస్తోంది. ముఖ్యంగా తమ పక్కన ఓ లోకం తెలియని పసి బాలుడూ, ఇపుడిపుడే లోకాన్ని ఆసక్తిగా తిలకించాలని ఉబలాటపడే పసిబాలుడూ ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఇళ్ళల్లో నిరంతరం కరోనా వార్తలతో చావు కబుర్లతో నింపేయడం నిజంగా వాళ్ళలో జీవనేచ్ఛను చంపేయడమే. మాస్కులు ఉపయోగించే విషయంలో ఫిజికల్ డిస్టాన్సింగ్ని పాటించే విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉండేవాళ్ళు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదమౌతుంది.
భవిష్యత్తు పట్ల సుందరమైన కలలు కనడం, భవ్య జీవితాన్ని మహాద్భుతంగా ఊహించడం బాలల హక్కు. చోటా భీం, స్పైడర్ మ్యాన్, హారీపోటర్లతో కూడిన అద్భుత రసానుభూతి వారి ఆటల్లో మాటల్లో పొంగి పొరలాల్సిన వయసులో భీభత్స భయానక కరుణ రసాలు నిండిపోతున్నాయి. మన ముందు తరాల వారు కూడా మనకంటే పెద్ద విపత్తులనే తమ జీవితాల్లో ఎదుర్కొన్నారు. ఐనా గానీ మనకేనాడూ భయానక భవిష్యత్తును కలగనమని వాళ్ళు చెప్పి పోలేదు. వాళ్ళెంత క్షోభను అనుభవించినా మనకు మాత్రం ఓ సుందరమైన కలలు గనగల జీవితాన్నే ప్రసాదించారు. మనం మాత్రం బాధ్యతా రాహిత్యంతో పిల్లల కలల్ని చిదిమేస్తున్నాం. వారి బాల్యాన్ని వారికి కాకుండా చేస్తున్నాం. సమాచార విప్లవమంటూ వారి జీవితాలను నిరంతరం మృత్యు వార్తలతో, అది కూడా మరిన్ని భాషా విశేషణాలతో, భీతిగొలిపే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా నింపేస్తున్నాం.
పిల్లలు తడిచిన సిమెంట్ లాంటివారు. ఎవరు ఏ గుర్తు పొరపాటుగా వేసినా తరువాతి కాలంలో అది శాశ్వత ముద్రగా మిగిలిపోతుంది. మెదడులో ఎమోషనల్ సెంటర్ అమిగ్దలాకు రేషనల్ సెంటర్ ఫ్రాంటల్ కార్టెక్సుకూ మధ్య సంబంధం మన పెద్దలలో అభివృద్ధి చెందినంతగా పిల్లలలో అభివృద్ధి చెంది ఉండదు. వారి ఎమోషన్ కి అందుకే ఏ రేషనాలిటీ ఉండదు. వారి కంటే ముందు తరం వారిమిగా వారి ఎమోషనల్ సపోర్టర్లుగా రేషనల్ డవలపర్స్గా మనం మారలేకపోతే రాబోయే తరానికి కరోనాకంటే మన తరమే పెద్ద శాపంలా పరిణమిస్తుంది. కరోనాను దానిచుట్టూ అల్లుకున్న భయాన్నీ తొలగించి ముందు తరాలవారికి మంచి జీవితాన్ని అందించడం మన తరం బాధ్యత. ఇది గుర్తించక తప్పదు. “ఒక సమాజం పిల్లలను చూసుకునే విధానంలోనే దాని ఆత్మ బహిర్గతమౌతుందని” నెల్సన్ మండేలా అంటారు. మనం మన సమాజాత్మను కాపాడుకోక తప్పదు.
చాలామంది కరోనా పాండమిక్ వంటివి చూసి ప్రపంచం అంతమైపోతోందని మాట్లాడు తుండటం చూస్తుంటాం. కానీ కరోనా వైరస్ పిల్లల జోలికి పోకపోవడంతో ఈ ప్రకృతి మానవాళి మీద ఇంకా ప్రేమను కోల్పోలేదని అర్థమౌతుంది.
డాక్టర్ విరించి విరివింటి
ఎంబిబిఎస్, క్లినికల్ కార్డియాక్ ఫిజీషియన్
Courtesy: NT