– యూపీలోని అలీగఢ్లో ఖాకీల దౌర్జన్యం..
– ఏడుగురికి గాయాలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
లక్నో,అలీగఢ్ : యూపీలోని అలీగఢ్లో పౌర నిరసనకారులపై పోలీసులు ఉగ్రరూపం దాల్చారు. దాదాపు నెలరోజుల నుంచి నిరసనలు చేస్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు గాయాలపాలయ్యారు. నిరసనకారులు, పోలీసులు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించారు. అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో జిల్లా యంత్రాంగం నగరంలో ఆరుగంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా, బుల్లెట్ గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు సమాచారం. అలీగఢ్లో దాదాపు నెలరోజుల నుంచి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు దీక్షలు చేస్తున్నారు. ఎండ, చలిని లెక్క చేయకుండా ఈ నిరసనలను వారు కొనసాగిస్తున్నారు.
అయితే శుక్రవారం నాడు ఆ ప్రాంతంలో వర్షం కురవడంతో రక్షణగా వారు టెంట్లు వేసుకునే ప్రయత్నాన్ని చేశారు. ఇది గమనించిన పోలీసులు టెంట్లు వేసుకోవడానికి నిరాకరిం చారు. నిరసనలు ముగించాల నీ, అక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే శాంతియుతంగా చేస్తున్న తమ నిరసనలపై పోలీసులు కర్కశత్వాన్ని ప్రదర్శించడం పట్ల నిరసనకారులు ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. అనంతరం నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అంతటితో ఆగకుండా నిరసనకారులపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సహా ఏడుగురు గాయపడ్డారు. అనంతరం అక్కడ అదనపు భద్రతా బలగాలను మోహరింపచేశారు.
Courtesy: NT
Leave a Reply