కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాధి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్-19 కేసుల్లో 42శాతం కేసులు 21 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సు కలవారికి చెందినవేనని తెలిపింది. అలాగే తొమ్మిది శాతం కేసులు 20 ఏండ్లలోపు ఉన్నవారికి చెందినవని వివరించింది. ఇక 17శాతం కోవిడ్-19 కేసులు 60 ఏండ్లకు పైబడిన వారి నుంచి ఉన్నాయని చెప్పింది. అలాగే 41 నుంచి 60 ఏండ్ల మధ్యఉన్నవారి కేసులు 17శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. కాగా, చిన్నారులు, వృద్ధులకు మాత్రమే కరోనా త్వరగా వ్యాపించే ప్రమాద మున్నదని ఇప్పటి వరకూ వార్తలు వినబడి నప్పటికీ కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. దీంతో అన్ని ఏజ్ గ్రూపు లకు చెందిన వారు కరోనా విషయంలో జాగ్రత్తలు వహించాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరి స్తున్నారు.
టెస్టింగ్ కిట్ల ఎగుమతిపై కేంద్రం పరిమితులు
దేశంలో తీవ్రంగా పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. కరోనా టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై పరిమితులు విధించింది. దీనిని వెంటనే అమలులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో పేర్కొన్నది. దేశంలో కరోనా వ్యాప్తికి ముందు కిట్ల ఎగుమతులపై ఎలాంటి పరిమితులు లేవు. అయితే తాజా నిర్ణయంతో కిట్ షిప్మెంట్ కోసం ఎగుమతిదారుడు కేంద్రం నుంచి లైసెన్సును పొందాల్సిన అవసరం ఏర్పడింది. కాగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. దేశంలో కరోనా వైరస్ పరీక్షల కోసం 182 ల్యాబ్లు(130 ప్రభుత్వ, 52 ప్రయివేటు ల్యాబ్లు) ఉన్నాయి.
ఛత్తీస్గఢ్లో తెరుచుకోనున్న మద్యం దుకాణాలు
రారుపూర్ : కరోనాను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా దేశంలో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మూతపడిన మద్యం దుకాణాలను తిరిగి తెరవడానికి ఛత్తీస్గఢ్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. మద్యం దొరకకపోవడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతుండటంతో దానిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ సర్కారు ఈ వైపుగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే కేరళ సర్కారు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడానికి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తిరిగి ఓపెన్ చేయబోతున్న రెండో రాష్ట్రం ఛత్తీస్గఢ్ కానున్నది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే ఆదేశాలను జారీచేసింది. రాష్ట్రంలో గతనెల 25న మూతపడిన మద్యం షాపులు అదే నెల 31 వరకు తెరవరాదని రాష్ట్ర సర్కారు ఆదేశాలు పంపింది. అయితే ఇంతలోనే ప్రధాని మోడీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించ డంతో దానిని ఈనెల 7 వరకు రాష్ట్ర సర్కారు పొగించింది.
రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించండి: కేంద్రాన్ని కోరిన కాంగ్రెస్
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని ఆర్థిక వనరులను అందించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ కోరారు. ప్రాణాంతక వ్యాధితో జరిపే పోరాటంలో వ్యూహాలను రూపొందించే సమయంలో రాష్ట్రాలనూ కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. కరోనాపై పోరాడటానికి రాష్ట్రాలకు లక్ష కోట్లు అందించాలని, పెండింగ్లో ఉన్న జిఎస్టి బకాయిలు రూ.42 వేల కోట్లు వెంటనే చెల్లించాలని ఆమె పేర్కొన్నారు. జీరో వడ్డీతో రాష్ట్రాలకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.దీనిపై ఆర్బిఐ వెంటనే కేంద్రంతో చర్చించాలని సూచించారు.
Courtesy: NT