- స్నాచింగ్ కేసులు నిల్
- తగ్గిన హత్యలు, బెదిరింపులు
- డయల్-100కు అనవసర ఫోన్లు
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ వేళ రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలు బయటకు వెళ్లకుండా.. ఇంటిపట్టునే ఉంటుండటంతో చోరీలు, వాహనాల దొంగతనాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దోపిడీలు వంటి కేసులు తగ్గిపోయాయి. స్నాచింగ్ కేసులు అస్సలు నమోదు కాలేదని రాష్ట్ర నేరాల నమోదు విభాగం (ఎస్సీఆర్బీ) డేటా చెబుతోంది. మార్చి లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించే వారిని పట్టుకునేందుకు పోలీ్సలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు నేరాల నియంత్రణకు దోహదపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాతి రోజు నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్తో ఏప్రిల్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన నేరాల్లో తగ్గుదల నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా 300 నేరాలు నమోదు కాగా ఏప్రిల్ 1 నుంచి 9 వరకు నమోదైన కేసుల సంఖ్య 77. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ వేళ మహిళలపై నేరాలు, గృహహింస పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నా.. తెలంగాణలో అవి తగ్గుముఖం పట్టాయి. డయల్-100కు కూడా లాక్డౌన్ సంబంధిత ఫోన్కాల్స్ వస్తున్నాయని అధికారులు తెలిపారు. జతనా కర్ఫ్యూ రోజు నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు డయల్-100కు 26,297 ఫోన్కాల్స్ వచ్చాయి. వీటిల్లో అత్యధికంగా రోడ్లపై భౌతిక దూరం పాటించకపోవడం వంటి ఫిర్యాదులకు సంబంధించినవే. నేరాలు, లాక్డౌన్కు సంబంధం లేని అనవసర కాల్స్ 94,968 దాకా వచ్చాయని తెలిపారు. ప్రజలు అత్యవసరం లేని సందర్భాల్లో డయల్-100కు ఫోన్ చేయొద్దని డీజీపీ మహేందర్రెడ్డి ప్రజలను కోరారు. అలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో సాయం అందకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
డయల్-100కు ఫోన్లు ఇలా..
జనాలు గుమిగూడి ఉన్నారు: 18,745
రవాణా సదుపాయం లేదు: 2,873
ఆహారం లభించడం లేదు: 2205
దుకాణాలపై ఫిర్యాదులు: 1281
అధిక ధరలకు వస్తువుల విక్రయం: 810
పోలీసు సహాయం కొరకు: 108
హాస్టల్ ఖాళీ చేయమన్నారని: 164
అత్యవసర సేవల వాహనాలు నిలిపారని: 87
అత్యవసర సేవల సిబ్బందిని ఆపారని: 24
Courtesy Andhrajyothi