- ఖండాలా నుంచి మహాబలేశ్వర్కు ప్రయాణం
- 21 మందిపై కేసు నమోదు
న్యూఢిల్లీ : యెస్బ్యాంకు కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎ్ఫఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ సహా.. వారి కుటుంబ సభ్యులు 21 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్-19 కేసుల తీవ్రతతో పుణె, సతారా జిల్లాలు దిగ్బంధంలో ఉండగా.. వాధ్వాన్ కుటుంబం ఇటీవల పుణె జిల్లా ఖండాలా నుంచి సతారా జిల్లాలోని టూరిస్ట్ స్పాట్ మహాబలేశ్వర్కు వెళ్లింది. వారికి మహారాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ గుప్తా అనుమతి లేఖను ఇచ్చారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. వాధ్వాన్ సోదరులు ఎన్సీపీ చీఫ్ శరద్పవార్కు ఆప్తులని బీజేపీ ఆరోపించగా.. తమ ప్రభుత్వం వెంటనే అమితాబ్గుప్తాను సెలవులపై పంపిందంటూ ఎన్సీపీ మంత్రులు సమర్థించుకున్నారు. కపిల్, ధీరజ్ సహా.. వారి కుటుంబాలకు చెందిన 21 మందిపై లాక్డౌన్ ఉల్లంఘనల కేసు నమోదు చేశామని మహాబలేశ్వర్ పోలీసులు తెలిపారు. ఈ ట్రిప్లో వాధ్వాన్ కుటుంబం వాడిన ఐదు లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఖండాలాలో ఉండాల్సిన వాధ్వాన్ సోదరులు సితారా జిల్లాకు వెళ్లినట్లు గుర్తించి, ఆ జిల్లా అధికారులకు సమాచారమిచ్చామని వివరించారు. లాక్డౌన్, కరోనా భయం నెపంతో వాధ్వాన్ సోదరులు తమ విచారణకు హాజరు కావడం లేదని ఈడీ అధికారులు వెల్లడించారు. కాగా.. ఉత్తరప్రదేశ్లో లాక్డౌన్ ఉల్లంఘనలపై మొత్తం 13,200 కేసులు నమోదయ్యాయి. వాహనదారుల నుంచి రూ. 5.87 కోట్ల మేర జరిమానా వసూలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లా ఖైర్కుండ్ గ్రామ సర్పంచ్ సహా.. సామూహిక ప్రార్థనలు చేసిన 40 మందిపై కేసు నమోదైంది.
Courtesy Andhrajyothi