– న్యాయపోరాటంలో లైంగికదాడి
– బాధితులకు దిక్కెవరు..
– కేసు పెట్టినా పట్టించుకోని పోలీసు వ్యవస్థ
– కామాంధులకు బలవుతున్న బాధితులెందరో..
కేంద్రమాజీ మంత్రి.. బీజేపీ నేత చిన్మయానంద్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ.. ఓ న్యాయ విద్యార్థిని కేసుపెట్టడానికి వెళ్తే.. ఖాకీలు ఠాణాలోకి అడుగుపెట్టనీయలేదు. చివరికి ఆమె ఆధారాలు చూపి మరీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేకానీ చిన్మయానంద్పై కేసుపెట్టలేదు. అధికారంలో ఉన్న యోగి సర్కార్ ఆమెపైనే బ్లాక్మెయిల్ కేసులు పెట్టి ఏవిధంగా హింసిస్తున్నదో.. ఎంతటి దారుణాలకు తెగబడుతున్నదో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఒక్క కేసులోనే కాదు.. మోడీ అధికారంలోకి వచ్చాక.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు భద్రత లేకుండా పోతున్నదనటానికి ఎన్నో సాక్ష్యాలు.. మరెన్నో ఆధారాలు.. ధైర్యం చేసి పోలీస్స్టేషన్ గడప తొక్కిన బాధితులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కేసు పెట్టేందుకు కూడా వారు నిరాకరిస్తుండటంతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరుగుతుండటం వ్యవస్థలో లోపాలను వెలుగులోకి తెస్తున్నది. అలాగే ప్రాణాలకు తెగించి న్యాయ పోరాటం చేస్తున్న మహిళలకు, బాధితులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతున్నది..
న్యూఢిల్లీ : ఇంటి గడపదాటిన ఆడ బిడ్డ తిరిగి సురక్షి తంగా తిరిగి వస్తుందా..రాదా..అనే పరిస్థితులు కనిపిస్తు న్నాయి. మోడీ సర్కార్ వచ్చాక… లైంగికహింస రోజురోజు కూ పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా 2016లో దాదాపు 30 వేల లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. ఇవి నమోదైన కేసులు మాత్రమే. కానీ, పోలీసు స్టేషన్ గడప ఎక్కని కేసు లు ఇందుకు రెట్టింపేనని మహిళా సంఘాలు అంటున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి న్యాయం, దర్యాప్తు వ్యవ స్థలో లొసుగులు ప్రస్ఫుటంగా కనిపిస్తు న్నది. లైంగికదాడి తర్వాత యువతులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతు న్న ఘటనల్లో ఇదిప్రతిబింబిస్తున్నది. ఆత్మహత్య, ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన అనేక కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులు చెప్పింది ఒక్కటే. తమ ఫిర్యాదు దర్యాప్తులో పోలీ సులు నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, ఫిర్యాదు నమోదుకు నిరాకరి స్తున్నారన్నది వారి ఆరోపణ. ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. చట్టం, న్యాయవ్యవస్థల లొసుగులను బహిర్గతం చేశాయి. తనకు జరిగిన ఘోరంపై 24ఏండ్ల మహిళ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకో లేదు. మనస్తాపానికి గురైనఆమె ఆత్మహ త్య చేసుకుంది. ఇంటి గోడలపైనా, చేతుల మీద నేరస్తుల పేర్లను రాసి మరీ బాధితు రాలు మృతిచెందింది. ఈ ఒక్క కేసే కాదు.. ఇటీవల ఇలాంటి అనేక సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. పోలీ సుల ఉదాసీనతను వెలుగులోకి తెచ్చేలా వారు మృత్యుదరికి చేరుతున్నారు. న్యాయం కోసమే యువతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని టాటా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ శ్రుతి కుమార్ చెప్పా రు. ‘బాధ, భయంకరమైన పరిస్థితులను, తీవ్ర మానసిక వేదనను వారు ఎదుర్కొంటున్నారు. తమకు మిగిలిన ఏకైక చర్య అదేనని వారు భావిస్తున్నారు’ అని ఆమె అభిప్రాయ పడ్డారు.
ఆత్మహత్య తర్వాత.. పోలీసుల హడావుడి
యువతులు, మహిళలు ఆత్మహత్యకు పాల్పడిన లేదా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందర్భాలలో.. పోలీసులు హడావుడిగా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధప డుతున్నారు. ఎందుకంటే ఆత్మహత్యకు పాల్పడిన బాధితు రాలి ప్రధాన డిమాండ్ సాధారణంగా ఇదే కావటంతో పోలీసులు చర్యలు తీసుకోకతప్పటంలేదు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటివే ఇటీవల పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో ఒకరు కాన్పూర్కు చెందిన 13 ఏండ్ల మైనరు కావ టం గమనార్హం. కేసు నమోదుకు తిరస్కరించటంతో పోలీ సుస్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన ఆమె కిరోసిన్ పోసుకుకొని నిప్పటించుకున్నది. ఉన్నావోలోని మఖ్కీ పోలీసు స్టేషన్ వద్ద బాధితురాలు, ఆమె తల్లి బలవన్మర ణానికి యత్నించారు. ఇదే ప్రాంతంలో మైనరుపై ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడిన ‘ఉన్నావో’ కేసును సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరుపు తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి.. ఉన్నావో, షాజహాన్పూర్ కేసుల్లో నేరస్తులిద్దరూ బీజేపీకి చెందిన నేతలు కావటంతో కేసు నమోదుకు ఈ రెండు కేసుల్లోనూ బాధితులు పెద్దపోరా టమే చేయాల్సివచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వారిద్దరూ సిద్ధపడ్డారు. వారి ధైర్యసాహసాలు, మొక్కవోని దీక్ష నిందితులను ఊచలు లెక్కపెట్టించాయి. ఉత్తరప్రదేశ్లోని హాపూర్కు చెందిన సామూహిక లైంగికదాడి బాధితురాలు సజీవ దహనానికి పాల్పడింది. ఈ మహిళ ఆగస్టు 23న తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. నిందితులతో సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా పోలీసులు ఒత్తిడిచేశారు. చివరకు చనిపోయిన తర్వాత ఆమె రాతపూర్వక ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా మార్చారు. పోలీసు ఉన్నతాధికారి ఎస్ చన్నప్ప వ్యవస్థలో ‘లోపాలను’ అంగీకరించారు. ఆమె ఆత్మహత్య తర్వాత పలువురు పోలీసు అధికారులపై వేటు వేశారు.
నేరాలను తక్కువచేసి చూపేందుకు…
ఎఫ్ఐఆర్లు నమోదు కాకపోవడానికి నేర గణాంకాల ను తక్కువగా చూపించాలని పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి చేయటమే ప్రధాన కారణమని ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకాష్ సింగ్ అన్నారు. నేరాలు తగ్గలే దనీ, అవి పెరుగుతూనే ఉన్నాయనీ, లెక్కల్లో మాత్రమే తేడాలున్నాయని చెప్పారు. బాధితుల ఆత్మహత్యలు యూపీకే పరిమితం కాలేదు. 2019 జులై 28న జైపూర్కు చెందిన ఓ మహిళ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో ఆత్మహత్యకు ప్రయ త్నించింది. తన భర్త స్నేహితుడే తనపై లైంగికదాడికి పాల్ప డినట్టు ఆమె ఫిర్యాదుచేసింది. కేసును వెనక్కి తీసుకోవాలని పోలీసులు ఆమెపై ఒత్తిడి పెంచారు. ఆమె భర్త నుంచి కూడా అలాంటి ఒత్తిడినే ఎదుర్కొన్నది. నిరాకరించటంతో ఆమెపై బెదిరిం పులకు పాల్పడ్డారు. చివరకు ఎస్ఎస్పీ కార్యాలయంలో కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించింది.
న్యాయస్థానాలు..
‘న్యాయస్థానాల్లో ప్రస్తుతం లైంగికదాడి కేసులు లక్ష వరకూ పెండింగ్లో వున్నాయి. కేసు నమోదుచేసి ఐదు నుంచి పదేండ్లు అయినా కేసు తేలదు.’ అని సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ అధినేత రంజనా కుమారి అన్నారు. షాజ హాన్పూర్, ఉన్నవోలో బీజేపీ నేతలు నిందితులుగా వున్న హై ప్రొఫైల్ కేసులు చట్ట అమలులోపాలను ఎత్తిచూపాయి. షాజహన్పూర్కు చెందిన 23 ఏండ్ల న్యాయ విద్యార్థిని తను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది. సాక్ష్యాలను సైతం ఆమె దర్యాప్తు అధికారులకు అందించింది. కానీ, నిందితుడికంటే ముందు.. ఆమెనే అరెస్టు చేశారు. ఈలోగా చిన్మయానంద్ ఆస్పత్రిలో చేరారు. న్యాయ విద్యార్థి జైలు శిక్ష అనుభవిస్తుండగా, నిందితుడు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుకుంటూ ఆస్ప త్రిలో వున్నాడు. కానీ, పోలీసులు లైంగికదాడి కంటే.. అతడి ని బ్లాక్మెయిల్చేసిన కేసుపైనే ఎక్కువగా దృష్టిసారి స్తున్నారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు ఆ ఘోర క్రూరత్వ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసన వ్యక్తంచేశారు. కానీ, ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నపుడు కోర్టు వరకూ వెళ్ళటానికి బాధితులకు ఎంతో ధైర్యంకావాలి. మనోనిబ్బరాన్నీ, ధైర్యాన్ని కూడగ ట్టుకుని న్యాయం కోసం పోలీసుస్టేషన్ల గడప ఎక్కితే.. వారికి జరుగుతున్నదేమిటి? అన్నిటికీ ఎదురొడ్డి న్యాయం కోసం పోరాడుతున్న ‘నిర్భయ’లకు ఆత్మహత్యలే శరణ్యమన్న భావన కలగకుండా నడుంబిగించాల్సిన అవసరమున్నది. రక్షకభట నిలయాలు కాస్త కామాంధులకు అండగా నిలుస్తున్న పరిస్థితుల్లో.. బాధితులకు భరోసా కల్పించేలా మహిళా లోకం తోడుగా నిలవాలి, కార్యోన్ముఖులు కావాలి.
(Courtesy: NT)