నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు రాష్ట్రాలలో గోహత్య, ఆవు మాంసం ఉందన్న అనుమానాలతో మైనారిటీలు దళితులపై దాడులు హత్యాకాండలు జరిగాయి. అనేక ఘోర ఉదంతాలను దర్యాప్తు జరిపిన ప్రజా సంఘాలు ఇవి అసత్యాలని కేవలం విద్వేష హత్యలని నిర్ధారించాయి.
గోవా అసెంబ్లీలో వచ్చిన ఒక ప్రశ్న మానవతావాదులు అందరినీ ఆలోచనకు గురిచేసింది. గోవా మదే అభయారణ్యం పులులు ఆ చుట్టుపక్కల ఆవుల్ని చంపి తినసాగాయి. దీంతో ఆ ప్రాంత రైతులు ఒక పులి, 4 పులి పిల్లల్ని విషం పెట్టి చంపారు. ఈ అంశం గోవా అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఎన్సీపీ శాసనసభ్యుడు మాట్లాడుతూ గోవధ పేరుతో దేశంలో ముస్లింలను చంపుతున్నారని, మరి అదే ఆవుల్ని తిన్న పులులకు ఏం శిక్ష వేస్తారని ప్రశ్నించారు. పేద రైతు కుటుంబాలు పశు సంపద పైనే ఆధార పడతాయని ఆయన వాపోయారు. మొత్తం మీద ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ ప్రశ్న సభ్య సమాజాన్ని ఆలోచింప చేసేదిగా ఉన్నది.