– ఏడాదిలో 86 రేప్ కేసులు.. 185 లైంగిక వేధింపుల కేసులు
లక్నో : ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావో జిల్లా ”లైంగికదాడుల రాజధాని”గా పేరు గడించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు ఉన్నావోలోనే 86 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబం ధించి 185 కేసులు నమోదయ్యాయి. దాదాపు 30 లక్షల జనాభాను కలిగి ఉన్న ఉనావో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 63 కిలోమీటర్ల దూరంలోనూ, కాన్పూర్కు 23 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. కులదీప్ సెంగార్ కేసు, బాధితురాలిని పెట్రోలు పోసి తగలబెట్టిన గురువారం నాటి సంఘటనతోసహా పుర్వాలో మహిళపై లైంగికదాడి వంటి పలు ప్రముఖ కేసులు ఉన్నావ్లోనే జరిగాయి. పుర్వా కేసులో నవంబరు 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగికదాడి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఈ కేసులు జిల్లాలోని అశోహ, అజ్గెయిన్, మఖి, బంగరమౌ ప్రాంతాల్లో జరిగాయి. వీటిల్లో అత్యధిక కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసి బెయిల్పై విడిచిపెట్టడమో, పరారు కావడమో జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్థానిక ప్రజల నుంచి పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
”ఉన్నావోలో పోలీసులు పూర్తిగా రాజకీయ నాయకుల నియం త్రణలోకి వెళ్లిపోయారు. వారి రాజకీయ బాస్ల నుంచి అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఈ వైఖరి నేరస్తులను ప్రోత్సహిస్తున్నది” అని అజ్గెయిన్ నివాసి రాఘవరామ్ శుక్లా వెల్లడించారు. ”ఇక్కడి నేరాలు రాజకీయమవుతున్నాయి.
తమదైన ప్రయోజనాల కోసం నేరాలను రాజకీయ నాయకులు ఉపయోగించు కుంటున్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతున్నారు. ఇటీవల కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు భూమిని సేకరించడాన్ని రైతులు ప్రతిఘటించగా అది హింసాత్మకంగా మారింది. పోలీసులు కఠినంగా వ్యవహరించిన కేసు ఒక్కటి కూడా లేదు” అని స్థానిక న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు..
(Courtesy: NT)