సూరత్లో ఆందోళన
స్వస్థలాలకు పంపించాలని డిమాండ్
60 మందిని అరెస్టు చేసిన పోలీసులు
గాంధీనగర్ : గుజరాత్లోని సూరత్లో వలసకూలీలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. లాక్డౌన్ మినహాయింపుల్లో భాగంగా నగరాల్లో పనిచేస్తున్న వలసకూలీలు తమ స్వస్థలాలకు చేరవేయాలని ఆదేశాలున్నా.. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టు వ్యవహరించడం లేదు. దీంతో సూరత్లోని పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న హజిరాకు సమీపంలో ఉన్న మోరా అనే గ్రామంలో దాదాపు వేయి మంది వలసకూలీలు రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సొంత ప్రాంతాలకు వెళ్లడానికి తమకు అనుమతినివ్వాలనీ, ఆ మేరకు రవాణా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వందలాదిగా వచ్చిన కార్మికులు ఒక్కసారిగా గుమిగూడటంతో పోలీసులు వారిపై లాఠీచార్జికి దిగారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. తర్వాత అధికారుల జోక్యంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనలో 60 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిరసనలో పాల్గొన్న కార్మికులంతా ఒడిషా, బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా చెబుతున్నారు. వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న సూరత్లో.. దేశవ్యాప్తంగా లక్షలాది వలసకార్మికులు పనిచేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇక్కడి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన కార్మికులు.. వరుసగా నిరసనలకు దిగుతున్నారు.
గడిచిన 20 రోజుల్లో కూలీలు ధర్నాకు దిగడం ఇది నాలుగోసారి. గతవారం కూడా కార్మికులు తమను స్వగ్రామాలకు పంపాలని భారీ ఆందోళన చేపట్టగా.. పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టిన విషయం తెలిసిందే. కార్మికుల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామని కేంద్రం చెబుతున్నా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో కార్మికులకు ఇక్కట్లు తప్పడం లేదు.
Courtesy: NT