– సీఎంను మారుస్తారన్న ఊహాగానాలపై వార్త రాసిన ఫలితం
– అరెస్టు చేసిన పోలీసులు
అహ్మదాబాద్ : గుజరాత్లో బీజేపీ సర్కారు జర్నలిస్టుల గొంతును అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నది. తమకు నచ్చని వార్తలు రాసిన జర్నలిస్టుల రాతలకు బ్రేకులు వేస్తున్నది. గుజరాత్ సీఎం విజరు రూపానీని తొలగించి ఆయన స్థానంలో ప్రస్తుత కేంద్ర మంత్రి మన్సుఖ్ మాన్డ్వియాను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాలపై కథనాన్ని రాసిన ఓ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ఎడిటర్ ధావల్ పటేల్ను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై దేశద్రోహం కేసును మోపారు. రాష్ట్రంలో కోవిడ్-19 తీవ్రంగా విజృంభిస్తుండటం, దానిని కట్టడి చేయడంలో విజరు రూపానీ వైఫల్యం చెందటంతో ముఖ్యమంత్రి మార్పుపై మాన్డ్వియాతో బీజేపీ పెద్దలు ఢిల్లీ పెద్దలు మంతనాలు జరిపారని సదరు ఆర్టికల్లో జర్నలిస్టు పేర్కొన్నారు. ప్రస్తుతం గుజరాత్లో కరోనా కేసులు, మరణాలు విపరీతం పెరిగిపోతుండటంతో ఆ మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమైన బీజేపీ సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సర్కారు వైఫల్యంపై పలు స్థానిక న్యూస్ చానెళ్లు, వార్త పేపర్లు కథనాలను వెలువరుస్తూ సీఎం మార్పు ఉండొచ్చనే వార్తలను వెలువర్చాయి కూడా. అయితే ఇతర ఏ వార్త సంస్థలపై చర్యలు తీసుకోని బీజేపీ ప్రభుత్వం కేవలం ధావల్ పటేల్ను మాత్రమే అరెస్టు చేయించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు, వ్యాసాలు, కథనాలు రాసే జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను గతంలో అరెస్టు చేయించడం, నిర్బంధించడం, అక్రమ కేసులు బనాయించటం వంటివి గుజరాత్ సర్కారు గతంలోనూ చేసింది. అయితే, ఎడిటర్ ధావల్ పటేల్ అరెస్టుపై పలు జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Courtesy: NT