- సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ తిరస్కరణ
హైదరాబాద్: ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్, టీఎంయూ అధ్యక్షుడు ఇ.అశ్వత్థామరెడ్డికి సెలవు ఇచ్చేందుకు సంస్థ యాజమాన్యం నిరాకరించింది. ప్రస్తుతం సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ప్రతి ఉద్యోగి తప్పక విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా సెలవు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్టాండ్లో నోటీసు బోర్డుపై నిరాకరణ పత్రాన్ని అంటించింది. ఆర్టీసీ ఉద్యోగులు అక్టోబరు 5 నుంచి నవంబరు 25 వరకు 55 రోజులపాటు సమ్మె చేయడం, అనంతరం సీఎం కేసీఆర్ ప్రకటనతో నవంబరు 29 నుంచి విధుల్లో చేరడం తెలిసిందే. కాగా అశ్వత్థామరెడ్డి తనకు ఆరు నెలలపాటు సెలవు కావాలని, ఈ నెల 6 నుంచి 2020 మే 5వ తేదీ వరకు సెలవు మంజూరు చేయాలంటూ 5న దరఖాస్తు చేశారు. అయితే సెలవు ఇవ్వలేమని, విధుల్లో చేరాలని పేర్కొంటూ నోటీసు బోర్డుపై కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ పేరిట నిరాకరణ పత్రాన్ని అంటించారు. కాగా ఉద్యోగికి సెలవును నిరాకరిస్తే వ్యక్తిగతంగా వివరణ లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, తనకు ఎలాంటి వివరణ లేఖ అందలేదని అశ్వత్థామరెడ్డి తెలిపారు. సంస్థ అధికారులు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వంద మంది ఉద్యోగులతో నిర్వహించనున్న వన భోజనాలతో వారికి ఒరిగేదేమీ ఉండదన్నారు.