కడప/సుండుపల్లె: భగవద్గీత నేర్పిస్తానంటూ ఓ కీచక పూజారి 14 సంవత్సరాల గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ సంఘటన కడప జిల్లా సుండుపల్లె మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భక్తవత్సలం తెలిసిన వివరాల మేరకు.. సుండుపల్లె మండలం రాయవరం గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన దేరంగుల రవి అలియాస్ సత్యనారాయణ(35) నాలుగు సంవత్సరాలుగా జీకేరాచపల్లెలోని రామాలయంలో పూజారిగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి భగవద్గీత గురించి బోఽధించేవాడు. సుమారు 20 రోజులుగా రామాలయంలో కొందరు పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాడు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం పరీక్ష పెడతానని రావాలంటూ 8వ తరగతి చదువుతున్న గిరిజన బాలికకు చెప్పాడు. దీంతో ఆ బాలిక బుధవారం మధ్యాహ్నం 12గంటలకు రామాలయం వద్దకు వెళ్లింది.
అక్కడ ఇతర విద్యార్థులెవ్వరూ లేరు. బాలిక ఒక్కటే పరీక్ష రాసి వెనుదిరిగింది. అయితే తను పరీక్ష రాసిన అట్ట (రైటింగ్ ప్యాడ్) అక్కడే మర్చిపోవడంతో దానిని తెచ్చుకునేందుకు తిరిగి వెళ్లింది. ఆలయం వెనక ఉన్న తన గదిలో అట్ట ఉందని వెళ్లి తెచ్చుకోమని పూజారి చెప్పాడు. బాలిక గదిలోకి వెళ్లగానే వెనకే వెళ్లిన పూజారి తలుపుకు గొళ్లెం పెట్టి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం నుంచి గదిలోనే ఉంచుకుని సాయంత్రం 6 గంటలకు బాలికను పంపించాడు. దీంతో బాలిక రోదిస్తూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. గురువారం బాధితులు ఫిర్యాదు చేయడంతో సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ పూజారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తొందరలో పట్టుకుంటామని ఎస్ఐ వివరించారు.
Courtesy Andhrajyothy