ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా
నాన్నా క్షమించు.. ఇదే నా చివరి సందేశం
తల్లి చిత్రపటం ముందే బలవన్మరణం
తండ్రికి ఆస్తులున్నా.. అడగలేకే ఆత్మహత్య
హైదరాబాద్ కొత్తపేటలో ఘటన
నల్లగొండ, నాగర్కర్నూల్లో విషాదం
కొత్తపేట/హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ టెకీ.. తన భార్యాపిల్లలకు విషమిచ్చి చంపేసి.. తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం, సూసైడ్నోట్ ప్రకారం.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మకు చెందిన కొట్ర యాదయ్య కుమారుడు ప్రదీ్పకుమార్(36) సాఫ్ట్వేర్ ఇంజనీరు. బీటెక్ చదువుతున్నప్పుడే అతడి తల్లి చంద్రకళ చనిపోయింది. బెంగళూరులోని టీసీఎ్సలో.. ఆ తర్వాత గచ్చిబౌలి ఐబీఎంలో పనిచేశారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం, కొండారెడ్డిపల్లికి చెందిన స్వాతి(28)తో ఆయనకు 2012లో వివాహమైంది. కోఠి మహిళా కాలేజీలో స్వాతి ఎమ్మెస్సీ గోల్డ్మెడలిస్టు కావడం గమనార్హం. వీరికి ఇద్దరు పిల్లలు.. కల్యాణకృష్ణ (6), ఏడాదిన్నర వయసున్న జయకృష్ణ ఉన్నారు. ఐదేళ్ల క్రితం ప్రదీప్ హస్తినాపురం సంతోషిమాత కాలనీలో ఇల్లు కట్టుకున్నారు.
ఎన్నటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగంపై నమ్మకం పెట్టుకోకూడదని, సొంతంగా కంపెనీ ఉండాలని ప్రదీప్ భావించేవారు. ఆ క్రమంలో.. హౌసింగ్ లోన్ (రూ.30 లక్షలు) ఉండగానే.. ఎల్ఐసీ ద్వారా పర్సనల్ లోన్ (రూ. 22 లక్షలు) తీసుకున్నారు. భార్య బంగారాన్ని కుదువపెట్టారు. ఆ తర్వాత ఏంజరిగిందోకానీ.. అంతా నష్టపోయానంటూ ప్రదీప్ తన తండ్రికి రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ‘‘తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. ప్రేమతో కట్టుకున్న ఇంటిని వదులుకోలేను. ఎన్నో రోజుల నుంచి నిద్ర లేదు. నేను.. శాశ్వతంగా వెళ్లిపోతున్నాను. నీకు భారం కాకూడదని అంతా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నాం.
నన్ను క్షమించండి నాన్న’’ అని తండ్రికి రాసిన 8 పేజీల లేఖలో పేర్కొన్నారు. శనివారం నుంచి ప్రదీప్, అతడి భార్య ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో కంగారుపడ్డ యాదయ్య.. నగరంలోని తమ బంధువులకు సమాచారం అందించారు. ఆదివారం కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో.. యాదయ్య, ఇతర బంధువులతో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ప్రదీప్ ఇంటికి వెళ్లారు. తలుపులు లోపలి నుంచి గడియవేసి ఉండటంతో.. పోలీసుల సాయంతో కిటికీ తలుపులు బద్ధలు కొట్టారు. సోఫా పక్కన ప్రదీప్, బెడ్రూంలో స్వాతి, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా కనిపించారు. తల్లి చంద్రకళ మీద ప్రేమతో.. ఆమె చిత్రపటం వద్దే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. సంఘటనాస్థలంలో సేకరించిన ఆధారాల మేరకు.. ప్రదీప్ కుటుంబం గుర్తుతెలియని విషం కలిపిన రాగిజావ, ఆలుగడ్డ కూర వల్ల మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ప్రదీప్ కుటుంబం ఆత్మహత్య వార్త తెలియడంతో నల్లగొండలోని అతడి స్వగ్రామం నేరేడుగొమ్ములో, నాగర్కర్నూల్ జిల్లాలోని స్వాతి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రదీప్ కుటుంబం ఆత్మహత్యపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రికి ఆస్తులున్నాయని, ప్రదీప్ చేసిన అప్పు ఆ కుటుంబానికి ఓ లెక్క కాదని తెలిపారు.
Courtesy Andhrajyothi