- పొడిగింపు అవకాశాల్లేవు
- కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్పష్టీకరణ
- కొత్త కేసులు ఆగితే పొడిగించం: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ : దేశంలో లాక్ డౌన్ను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్ 14 వరకు విధించిన లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని వచ్చిన వార్తలు నిరాధారమైనవని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా చెప్పారు. ఈ మేరకు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ధ్రువీకరించింది. ప్రధాని మోదీ కూడా ఏప్రిల్ నెలాఖరులో మన్ కీ బాత్ సమయానికి ఆంక్షలు ఉండక పోవచ్చునని శనివారం సూచన ప్రాయంగా చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి కూడా కరోనా లాక్ డౌన్ను పొడిగించే అవకాశాలు లేవని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 901 అని, 27 మంది మరణించారని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విదేశాల నుంచి వచ్చిన చాలా మందికి 14 రోజుల క్వారంటైన్ పూర్తయిందని, వారందర్నీ త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. క్వారంటైన్లో ఉన్న వారిలో 10ు మంది ఇప్పటికే విడుదలయ్యారని తెలిపారు. మరో వారం రోజుల్లో వారి సంఖ్య 50 శాతానికి చేరుకుంటుందన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నట్లే భావించాలని, ఇదే పరిస్థితి కొనసాగుతూ కొత్త కేసులేవీ నమోదు కాని పక్షంలో లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉండకపోవచ్చునని చెప్పారు. అమెరికా, ఇటలీతో పోలిస్తే భారత్ సురక్షితంగా ఉందన్నారు. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలు, ఆహారం, రైల్వే, వైద్యం మొదలైన అనేక అంశాలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్లో ఉన్న ఈఎ్సఐ ఆస్పత్రిని కరోనా టెస్టింగ్ సెంటర్గా ప్రకటించే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు.
గడువులోగా అడ్డుకోగలమా?
ఆదివారం నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెయ్యి దాటడం, మరణాలు 27కు చేరుకోవడంతో ఏప్రిల్ 14 కల్లా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలమా? అన్నది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపఽథ్యంలో మిగిలిన 14 రోజులు లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా, కఠినంగా అమలు చేస్తారని అధికార వర్గాలంటున్నాయి. ఉపాధి కోల్పోయిన వేలమంది వలస కార్మికులు ఈ లాక్డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియక సొంత గ్రామాలకు తరలివెళుతున్న నేపథ్యంలో స్పష్టతనిచ్చేందుకే కేబినెట్ కార్యదర్శి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. వలస వెళ్లాలనుకున్న వారికి జాతీ య రహదారుల వద్ద ఆశ్రయం కల్పించాలని కేబినెట్ సెక్రటరీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
రెండో దశలోనే ఉన్నాం! అభివృద్ధి చెందిన దేశాల కన్నా మెరుగే : లవ్ అగర్వాల్
కరోనా వైరస్ కేసుల విషయంలో భారత్ ఇప్పటికీ స్థానిక వ్యాప్తి(రెండో) దశలోనే ఉందని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు వంద నుంచి వెయ్యికి పెరగడానికి 12 రోజులు పట్టిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి మనదేశంలో తక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్కరోజులో నలుగురు మరణించార ని చెప్పారు. దేశవ్యాప్తంగా 1071 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటివరకు 29 మంది మృతి చెందారని వెల్లడించారు. మనకన్నా చాలా తక్కువ జనాభా ఉన్న 7 అభివృద్ధి చెందిన దేశాల్లో 12 రోజుల్లో అనేక రెట్లు పాజిటివ్ కేసులు పెరిగాయని ఆయన వెల్లడించారు. (తొలి వంద కేసుల తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతపై ఆ ఏడు దేశాలతో భారత్ను పోలుస్తూ ఆంధ్రజ్యోతి సోమవారమే కథనం ప్రచురించడం గమనార్హం).
Courtesy Andhrajyothi