న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత సమానత్వం, మానవత ఆధారంగా ఒక కొత్త ప్రపంచీకరణను తీసుకురావాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 అనంతర ప్రపంచంలో కొత్త అంతర్జాతీయ వ్యవస్థ రూపొందాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అలీనోద్యమ (నామ్) సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా విపత్తు బట్టబయలు చేసిందన్నారు. నిజాయితీ, సమానత్వం, మానవత్వం ప్రాతిపదికగా ఒక కొత్త ప్రపంచీకరణను తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అంతర్జాతీయ వ్యవస్థలు నేటి అవసరం. కేవలం ఆర్థిక అభివృద్ధినే కాకుండా, మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే వ్యవస్థలు కావాలి. ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంద’ని చెప్పారు. మానవాళి అత్యంత తీవ్రమైన విపత్తును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అంతర్జాతీయంగా ఒక సంఘీభావ ప్రకటన అవసరమని, ఆ దిశగా సమిష్టి దృక్పథంతో నామ్ పాటు పడాలని మోదీ కోరారు. కరోనాపై సమరాన్ని భారత దేశం ప్రజాస్వామ్యయుతంగా, క్రమశిక్షణ, నిర్ణయాత్మకతలతో నిజమైన ప్రజాయుద్ధంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ఈ సందర్భంగా దాయాది దేశమైనా పాకిస్తాన్ను పరోక్షంగా విమర్శించారు. ప్రాణాంతక వైరస్ మాదిరిగా సామాజిక వర్గాలను-దేశాలను విభజించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని, నకిలీ వార్తలను సృష్టిస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించారు.