- ప్రణయ్ భార్య అమృతకు బెదిరింపులు, ప్రలోభాలు
- తండ్రి మారుతీరావు సహా మరో ఇద్దరిపై కేసు
మిర్యాలగూడ అర్బన్, నవంబరు 30: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది జరిగిన ప్రణయ్ హత్యలో ప్రధాన నిందితులు మారుతీరావు, ఎంఏ కరీంలపై మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. సీఐ సదానాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణయ్ భార్య అమృత వర్షిణిని ఆమె తండ్రి మారుతీరావు, కరీం బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం మారుతీరావు తన సన్నిహితుడైన కందుల వెంకటేశ్వరరావును మత్తిరెడ్డికుంటలోని అమృత ఇంటికి రాయబారానికి పంపించాడు. ‘చెప్పినట్లు నడుచుకుంటే మీ నాన్న ఆస్తినంతా రాసిస్తా అంటున్నాడు.
ఆయనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కేలా చేస్తానంటున్నాడు’ అని వెంకటేశ్వరరావు అమృతను ప్రలోభపెట్టాడు. ఇందుకు నిరాకరించిన ఆమె ఈనెల 11న వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం మారుతీరావు, కరీం, వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత సబ్ జైల్కు తరలించారు.
(Courtesy Andhrajyothi)