- స్నేహితుడితో కలిసి ప్రియుడి ఘాతుకం
- సామూహిక అత్యాచారం..
- మెడకు చున్నీతో ఉరి
- భయపడి రెండు రోజులకే ప్రియుడి ఆత్మహత్య
ప్రేమించిన యువతిని మాయమాటలతో నమ్మించి.. నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిపించి స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడో యువకుడు. అక్కడితో ఆగలేదతడి దుర్మార్గం! స్నేహితుడి సహకారంతో ఆమె ధరించిన చున్నీతోనే గొంతు బిగించి చంపేశాడు. తనను దూరం పెడుతోందన్న అసహనంతోనే అతడు ఇంతటి దారుణానికి తెగబడ్డాడు. అయితే పట్టుబడతానేమోనన్న భయంతో ఘటన జరిగిన రెండ్రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి జిల్లాలో వెలుగుచూసిందీ ఘటన.
యాదాద్రి : యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లికి చెందిన యువతి(25)కి అదే గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మిర్యాల రవి (25)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఆరు నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెకు అతడు విడతల వారీగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా నగదు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే కొంతకాలంగా రవిని ఆమె దూరం పెడుతోంది. దీంతో కోపం పెంచుకున్న రవి, ఆమెను హత్యచేయాలని పథకం వేశాడు. ఇందుకు గ్రామానికి చెందిన స్నేహితుడు చినపాక రవితేజ సాయం కోరాడు. ఈ నెల 18న వలిగొండ మండలం లింగరాజుపల్లి శివార్లోని వలిపాష గుట్టకు రావాలని యువతికి చెప్పాడు. మధ్యాహ్నం సమయంలో తన స్కూటీపై యువతి గుట్ట వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడికి రవితేజతో కలిసి బైక్ మీద వచ్చిన రవి మాట్లాడుకుందామని నమ్మించి ఆమెను గుట్టపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై రవి, రవితేజ అత్యాచారం చేసి.. మెడకు చున్నీ బిగించి హత్యచేశారు.
మృతదేహాన్ని పొదల్లోకి తోసి.. పైన చెట్ల కొమ్మలను కప్పారు. అనంతరం అక్కడి నుంచి రవి తన బైక్ తీసుకొని.. రవితేజ, యువతి స్కూటీని తీసుకుని వెళ్లిపోయారు. యువతి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగుతుండగానే రవి మృతదేహం 20న భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి సమీపంలో లభ్యమైంది. యువతి కుటుంబీకులే తమ కుమారుడిని హత్యచేశారంటూ పోలీసులకు రవి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. యువతి కనిపించకపోవడం, రవి అనుమానాస్పద మృతి కేసులపై దర్యాప్తు సాగుతుండగానే పోలీసులకు కీలక సమాచారం లభ్యమైంది. యువతి స్కూటీపై వెళ్లిన రవితేజ, పెట్రోలు బంక్కు వెళ్లి పెట్రోలు పోయించుకున్నట్లు తెలుసుకున్నారు. రవితేజను అదుపులోకి తీసుకొని విచారించారు.
అతడిచ్చిన సమాచారం మేరకు 29న వలిపాష గుట్టపైన కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. స్కూటీని స్వాధీనం చేసుకొని.. రవితేజను రిమాండ్కు తరలించారు. రవి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో పురుగుల మందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికలో పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
Courtesy Andhrajyothi