– కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత కరువై నష్టపోతున్న పేదలు
– సాయం అందడం లేదు : ఒక నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడటంతో దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉపశమన పథకాలు సరిగా అమలుజరగడం లేదు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు గానూ కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్డౌన్తో లక్షలాది మంది అసంఘటితరంగ కార్మికులు, వలస కూలీలు నిరాశ్రయులై పట్టణాల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. కాగా, వీరిని ఆదుకోవడానికి ప్రకటించిన ఉపశమన పథకాలు, ఆర్థిక సాయం.. బాధితులకు చేరకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపమే అని హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్వర్క్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక నివేదికను వెలువరించింది.
నివేదికలో పేర్కొన్న ప్రకారం… కరోనా మహమ్మారి విజృంభణతో లక్షలాది మంది దినసరి కూలీలు, వలస కార్మికులు, పేద, మధ్య తరగతి జీవుల ఉపాధి కరువైంది. అందరూ ఇంట్లోనే ఉండాలని నిబంధన విధించడంతో వారి జీవనోపాధి ప్రమాదంలో పడింది. నగరాల్లో ఉండే లక్షలాది మంది కార్మికులు సొంత ప్రాంతాలకు చేరడానికి పడుతున్న కష్టాలను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అసంఘటితరంగంలోని దాదాపు 7 కోట్ల మంది కార్మికులు.. పనుల్లేక నిరాశ్రయలయ్యారని అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. వీరిలో ఇంటికి చేరుకున్నా చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో ఆకలిబాధలు తప్పడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సరిగా అమలు జరగకపోవడంతో ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు వారికి చేరడం లేదు. అంతేగాక వారిని ఆదుకోవడానికి కేంద్రం ప్రకటిస్తున్న ఉపశమన పథకాల్లోనూ.. ప్రభుత్వాల మధ్య సఖ్యత కరువై దాని ఫలాలు అసలు లబ్దిదారులకు అందడం లేదు. దీనిని అధిగమించడానికి ప్రభుత్వాలు కలిసి పనిచేయడం అత్యంత ఆవశ్యకం. పేద ప్రజలకు ఆరునెలల పాటు ఆహార, వసతి, ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాలు ప్రకటించాలి. నిరాశ్రయులకు తాగునీరు, భోజన వసతి ఏర్పాటుచేయాలి. సామూహిక టాయిలెట్లను వేగంగా నిర్మించి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నివేదికలో పేర్కొన్నారు.
Courtesy: NT