– యూపీలో 13 ఏండ్ల బాలికపై లైంగికదాడి
– ఆపై గొంతునులిమి.. నాలుక కోసి హత్య
లక్నో : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, యువతులు, బాలికలపై లైంగికదాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ముఖ్యంగా దళితులకు అక్కడ భద్రత లేకుండా పోతున్నది. ఉన్నావో తరహా ఘటనలు ఇంకా కండ్ల ముందు మెదులుతుం డగానే.. యూపీలో మరో దళిత బాలిక అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది. ముందుగా ఆమెను అపహరించిన దుండగులు.. లైంగికదాడికి పాల్పడి, ఆపై గొంతు నులిమి హత్య చేశారు.
యూపీలోని ఖేరి జిల్లాలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్కు సరిహద్దు గ్రామమైన ఖేరికి చెందిన దళిత మైనర్ను అదే గ్రామస్తులైన సంతోష్ కుమార్ యాదవ్, సంజరు గౌతంలు గత శుక్రవారం అపహరించారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా అతి కిరాతకంగా హత్య చేశారు. రాత్రైనా తన కూతురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గ్రామం మొత్తం వెతకగా.. శనివారం మధ్యాహ్నం ఒక చక్కెర పొలంలో (నిందితుల్లో ఒకడిది) ఆ బాలిక మృతదేహం లభ్యమైంది.
అయితే తమ కూతురు కండ్లకు గాయమైందనీ, నాలుకను కోసేశారనీ, దుప్పట్టాతో గొంతు నులిమి హత్య చేశారని ఆమె తండ్రి ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం దీన్ని నిరాకరిస్తున్నారు. నిందితులను అరెస్టు చేశామనీ, సంబంధిత చట్టాల మేరకు వారిపై కేసులు నమోదుచేశామని వారు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి.
భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘ఇది జంగిల్ రాజ్యం కాక మరేంటి..? మా బిడ్డలు, ఇండ్లకు రక్షణ లేదు. అంతటా భయానక వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘బీజేపీ పాలనలో చిన్నారులు, మహిళలపై అరాచకాలకు అంతేలేకుండా పోతున్నది’ అంటూ ఆరోపించారు. ‘ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూంటే ఎస్పీ, బీజేపీ పాలనకు తేడా ఏమున్నది..?’ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు.
Courtesy: NT