గత ఐదేళ్లలో ఎన్నికైనవారిపై ఏడీఆర్ నివేదిక
తొలి రెండు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్
మూడు, ఆరు స్థానాల్లో వైకాపా, తెరాస
దిల్లీ : దేశంలో 76 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఈ కేసులున్న వారి సంఖ్య భాజపా (21)లో ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్(16), వైకాపా(7)లు ఉన్నాయి. గత ఐదేళ్లలో (2014-2019) జరిగిన ఎన్నికల్లో.. అన్ని పార్టీల్లో, అన్ని రాష్ట్రాల్లో కలిపి స్వతంత్రులతో సహా ఇలాంటి కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేల గణాంకాలను ఏడీఆర్ వెల్లడించింది. ఈమేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణపత్రాల (అఫిడవిట్ల)ను పరిశీలించి నివేదికను విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు..
* మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉండగా.. రెండు మూడు స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్రలు ఉన్నాయి.
* గత ఐదేళ్లలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో కలిపి మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటున్న 572 మంది పోటీచేశారు. వీరిలో భాజపా అభ్యర్థులు 66 మంది కాగా కాంగ్రెస్ 46, బీఎస్పీ 40 మందికి టిక్కెట్లు ఇచ్చాయి.
* ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 41 మంది అత్యాచార కేసులున్న వారికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి.
* సాక్షాత్తూ మహిళలు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలు కూడా మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటున్నవారికి టిక్కెట్లు ఇచ్చాయి.
(Courtesy Eenadu)