ముంబయి : పలు నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో కొలువుదీరిన మూడు పార్టీల కూటమి (మహా వికాస్ అఘాడీ) జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ విధానాల్లో లోపాలనూ, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న పాత్రికేయులు, పత్రికా, టీవీ యాజమాన్యాలపై కేసులు పెడుతున్నది. ఈ లాక్డౌన్ కాలంలో (మార్చి నుంచి ఇప్పటిదాకా)నే దాదాపు 15 మంది పాత్రికేయులపై పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. అయితే కరోనా మరణాలను దాచుతున్నారని కథనాలు ప్రచురించినా, పోలీసులే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వార్తలు రాసినా, ఇసుక అక్రమ రవాణాను వెలికి తీసినా.. జర్నలిస్టులు కేసుల పాలవుతున్నారు.
వలస కార్మికుల సంక్షోభాన్ని నివేదించాడని..
ఉస్మానాబాద్ కు చెందిన రాహుల్ కులకర్ణి మహారాష్ట్రలో ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీపీ మఝా ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ లో తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి గాను బాంద్రా రైల్వే స్టేషన్ లో మూడు వేల మందికి పైగా వలసకార్మికులు చేరుకున్నారనీ, అక్కడ వారిపై పోలీసులు లాఠీ చార్జి చేసిన వార్తను ఆయన రిపోర్ట్ చేశారు. ఇందుకు గాను పోలీసులు ఆయన తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మరో 11 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైన విషయం విదితమే..
కోవిడ్ మరణాలను దాస్తున్నారన్నందుకు…
మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాల్లోనూ విజృంభిస్తున్న కరోనా దాటికి వందలాదిమంది బలవుతున్నారు. అయితే చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం తక్కువుగా చుపిస్తున్నదని ఆరోపణలున్నాయి. ఇదే విషయం మీద ‘దివ్య మరాఠి’ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఔరంగాబాద్ లో కరోనా బారిన పడి 347 మంది చనిపోతే.. ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 219 గానే చూపెట్టిందనీ, మిగిలిన 128 మంది కూడా తీవ్రమైన శ్వాస సమస్యతోనే చనిపోయారనీ, అందుకు తగిన ఆధారాలను చూపుతూ జూన్ 06 న కవర్ పేజీ వార్తను ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఆ పత్రిక యాజమాన్యంతో పాటు మొత్తం ఆరుగురి మీద కేసు పెట్టింది.
లాక్డౌన్ కాలంలో మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా 55 మంది జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయని ఢిల్లీ వేదికగా పని చేసే రైట్స్ అండ్ రిస్క్ ఎనాలిసిస్ గ్రూప్ (ఆర్ఆర్ఏజీ)ఒక నివేదికలో తెలిపింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ (11 మందిపై), హిమాచల్ ప్రదేశ్ (5), తమిళనాడు, ఒడిశా, బెంగాల్లో నాలుగేసి చొప్పున పాత్రికేయులపై కేసులు నమోదయ్యాయి.
Courtesy: NT