హైదరాబాద్లో 15 రోజులు విధించే యోచన
నిత్యావసరాలకు 2గంటల వెసులుబాటు
రోజంతా కర్ఫ్యూ.. కట్టుదిట్టంగా అమలు
మూణ్నాలుగు రోజుల్లో కేబినెట్ భేటీ, నిర్ణయం
హైదరాబాద్ పెద్దనగరం.. వ్యాప్తి సహజమే
లాక్డౌన్కు అందరినీ సిద్ధం చేయాలి
ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య తక్కువే
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వేలాది బెడ్లు సిద్ధం
సీఎంకు వివరించిన మంత్రి ఈటల
హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న పెద్ద నగరం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్లోనూ అదే పరిస్థితి ఉండటం సహజం. లాక్డౌన్ విధిస్తే విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. ప్రభు త్వ పరంగా అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుంది.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మళ్లీ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిఽధిలోనే ఉంటున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. కరోనా వైరస్ నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేస్తామని, అలాగే హైదరాబాద్లో కొద్దిరోజులు తిరిగి లాక్డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తి నివారణకు మళ్లీ లాక్డౌన్ విధించారని గుర్తు చేస్తూ దేశంలో ఇతర నగరాలు కూడా ఈ దిశగానే ఆలోచనలు చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్లో 15 రోజులపాటు లాక్డౌన్ విధించాలని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. హైదరాబాద్, కోటి మంది నివసిస్తున్న పెద్ద నగరం అని, దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్లోనూ అదే పరిస్థితి ఉండటం సహజమని అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజల కదలికలు పెరిగాయని, దీని వల్ల కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతోందని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వాళ్లకు అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం, ఇతరత్రా అంశాలపై ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ గురించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జీహెచ్ఎంసీ పరిఽధిలో లాక్డౌన్ విధించడం అనేది చాలా పెద్ద నిర్ణయమని, ఆ దిశగా ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్థం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్థం చేయాలని అన్నారు. కేబినెట్ను సమావేశపరిచి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, లాక్డౌన్ గురించి నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. రెండు, మూడు రోజులపాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. అవసరమనుకుంటే మూడు, నాలుగు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలు, ప్రత్యామ్నాయాల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని, లాక్డౌన్ను కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిత్యావసర సరుకులు కొనుగోలుకు వీలుగా ఒకటి, రెండు గంటలు మాత్రమే సడలింపునిచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందన్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్నీ సిద్థం చేయాల్సి ఉంటుందని తెలిపారు.
మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువే : ఈటల
కరోనా గురించి పెద్దగా భయపడాల్సిందేమీ లేదని, వైరస్ మరణాల్లో జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాల రేటు తక్కువగానే ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. కొవిడ్ మరణాల జాతీయ సగటు 3.04 శాతం ఉందని, రాష్ట్రంలో అది కేవలం 1.52 శాతం మాత్రమే అని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైరస్ సోకినట్లు తేలిన వారికి తగిన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కరోనాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి గురించి సమీక్షలో సీఎం కేసీఆర్కు ఈటల వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరోసారి 15 రోజులపాటు లాక్డౌన్ విధించాలని అధికారులు, నిపుణులు కోరుతున్నారని తెలిపారు. చికిత్స అందించేందుకు ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా వేలాది పడకలను సిద్థం చేశామని చెప్పారు. వ్యాధి లక్షణాలు లేని వాళ్లను ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని ఈటల వివరించారు.
Courtesy Andhrajyothi