పంజాగుట్ట : అమృత బాబాయి శ్రావణ్పై ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టడమే కాకుండా అమృతకు రక్షణ కల్పించాలని అఖిల భారత కుల అసమానత నిర్మూలన పోరాట సమితి డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సమితి కన్వీనర్ లక్ష్మయ్య, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర సమన్వయకర్త ఊ సాంబశివరావు, దళిత ఉద్యమ నేత జేబీ రాజు, హెచ్సీయూ ప్రొఫెసర్ కేవై రత్నం తదితరులు మాట్లాడారు. ప్రణయ్ హత్యకేసులో తనకు శిక్ష పడకుండా ఉండేందుకు మారుతీరావు ఎన్నో ప్రయత్నాలు చేశాడని, చివరకు శిక్ష ఖరారు అవుతుందనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాంబశివరావు అన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనల మధ్య అమృత బతుకుతోందన్నారు. శ్రావణ్ కుమార్ భయపెట్టడమే కాకుండా బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడన్నారు. మారుతీరావుపై పోలీసులు 1600 పేజీలతో ప్రత్యేక న్యాయస్థానంలో చార్జీషీటు దాఖలు చేశారన్నారు. దీంతో విచారణ పదో తేదీ నుంచి జరుగుతుందని, తనకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
అమృత వెళ్లాలని అనుకోలేదు కానీ.. తండ్రి చనిపోతే వెళ్లవా… అంటారనే ఉద్దేశంతోనే వెళ్లిందన్నారు. అయినా ఆమెను అవమానించి అక్కడి నుంచి వెళ్లగొట్టారన్నారు. ప్రేమ వివాహాన్ని సమర్థించి ఉంటే మారుతీరావు గొప్ప వ్యక్తి అయ్యేవాడన్నారు. శ్రావణ్కుమార్ వివిధ రకాలుగా బెదిరిస్తున్నాడని, ఆయనపై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని, బెయిలు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ ప్లాన్ కింద కేసు నమోదు చేయాలన్నారు. మారుతీరావు ఆస్తిపైన శ్రావణ్కుమార్ కన్ను పడిందని, అందుకే ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రణయ్ది పరువు హత్య కాదని, కుల దురహంకార హత్య అన్నారు. ఈ ఘటనలో హత్య.. ఆత్మహత్య.. ప్రతి ఒక్కరికీ గుణపాఠం కావాలని తెలిపారు. దేశంలో హెచ్సీయూలో రోహిత్వేముల, ప్రణయ్ ఘటన ఎంతో సంచలనం సృష్టించాయని వాషింగ్టన్ పోస్ట్లో కూడా కథనం వచ్చిందన్నారు. తాము త్వరలోనే మిర్యాలగూడ వెళ్లి ఆమెకు సంఘీభావం తెలుపుతామన్నారు. సమావేశంలో న్యాయవాది లక్ష్మీదేవి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Courtesy Andhrajyothi