వారు మావోయిస్టులు కాదు
ఆ ఎన్కౌంటర్ బూటకం… ఎదురు కాల్పులకు ఆధారాల్లేవు
ఏడేళ్ల నాటి ఛత్తీస్గఢ్ ఘటనపై నిగ్గు తేల్చిన న్యాయ విచారణ
రాయ్పుర్: మావోయిస్టుల ఏరివేతలో భాగంగా 17 మందిని మట్టుబెట్టినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ఏడేళ్ల క్రితం చేసిన ప్రకటన బూటకమని తేలిపోయింది. 2012 జూన్ 28న బీజాపుర్ జిల్లాలోని సర్కేగుడ వద్ద కాల్పుల్లో చనిపోయిన వీరంతా సాధారణ గ్రామస్థులే అని జస్టిస్ విజయ్కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిటీ తేల్చింది. ఏడేళ్లపాటు విచారించిన తర్వాత సుమారు 45 రోజుల క్రితం కమిటీ ఈ మేరకు నివేదిక సమర్పించినట్లు ఆదివారం వెల్లడయింది.
‘‘అవతలి వారే కాల్పులు జరిపారని చెప్పడం తప్పు. వారే కాల్పులు జరిపారని, వారంతా మావోయిస్టులేనని చెప్పే ఎలాంటి రుజువుల్ని భద్రత బలగాలు సమర్పించలేకపోయాయి. తుపాకులను, తూటాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం కూడా తప్పు’’ అని కమిటీ నివేదిక పేర్కొంది. ఘటనపై పోలీసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. గ్రామస్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించిందని వారి తరఫు న్యాయవాది ఇషా ఖండేల్వాల్ చెప్పారు.
తాము జరిపిన ఎదురుకాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు ప్రకటించడం 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి భాజపా ప్రభుత్వం దీనిపై ఏకసభ్య కమిషన్ను నియమించింది. జస్టిస్ అగర్వాల్ పదవీ విరమణ పొందడానికి ముందు.. ఈ ఏడాది అక్టోబరు 17న నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించి, సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిలోని కొన్ని భాగాలపై రాజకీయ దుమారం మొదలైంది.
(Courtesy Eenadu)