– జీవనోపాధి కోల్పోయిన 67 శాతం మంది కార్మికులు
– పట్టణాల్లో 80 శాతం.. గ్రామాల్లో 57 శాతం మందికి ఆదాయం నిల్
– కిరాయి కట్టడానికీ డబ్లుల్లేవ్.. : అజీం ప్రేమ్జీ వర్సిటీ సర్వేలో వెల్లడి
కరోనా వ్యాప్తి నియంత్రణకు గానూ మోడీ సర్కారు విధించిన ‘దేశవ్యాప్త మూసివేత’ దేశంలో పేద ప్రజల పాలిట శాపమైంది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్ కారణంగా సామాన్య జనం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కార్మికులు, వలస కూలీలు, రైతులు, చిరు వ్యాపారులతో పాటు పేద, మధ్య తరగతి ప్రజానీకం జీవనోపాధి కోల్పోవడంతో వారి బతుకే ప్రశ్నార్థకమైంది. దశల వారీగా లాక్డౌన్ను పొడిగిస్తున్న ప్రభుత్వాలు.. పేదల కష్టాలను తుడవటమంటే మాత్రం ‘చప్పట్లు.. దీపాలు.. పూలవర్షాల’ పేరు చెప్పి అంతమేరకే పరిమితమవు తున్నాయి. తత్ఫలితంగా బీదలు బిక్కుబిక్కుమంటూ బతుకులీడుస్తున్నారు.
న్యూఢిల్లీ : సుమారు రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా అసంఘటిత, సంఘటిత రంగాల కార్మికుల్లో 67 శాతం మంది తమ బతుకుదెరువును కోల్పోయారు. గ్రామాల తో పోలిస్తే పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. నగరాల్లో పదిమంది ఉద్యోగులకు గానూ ఎనిమిది మంది తమ ఆదాయ మార్గాలు కోల్పోయా రని ఒక సర్వేలో
వెల్లడైంది.
బెంగళూరులోని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టేనేబుల్ ఎంప్లాయిమెంట్లోని పరిశోధకులు ఈ సర్వేను చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 4వేల మంది కార్మికులను ఫోన్ ద్వారా సంప్రదించి దీన్ని రూపొందించారు. ఏప్రిల్ 15 నుంచి మే మొదటివారం దాకా చేపట్టిన ఈసర్వేలో.. పట్టణ ప్రాంతాల నుంచి 57 శాతం మందిని, గ్రామీణ ప్రాంతాల నుంచి 43శాతం మంది తమ అభిప్రాయాన్ని వెలి బుచ్చారు. నివేదికలో పొందుపరిచిన అంశాలప్రకారం లాక్డౌన్ కారణం గా పట్టణ భారతం తీవ్రంగా ప్రభావితమైంది. దాదాపు 80 శాతం మంది తమ ఆదాయ మార్గాలను కోల్పోయారు. వీరిలో 84 శాతం మంది స్వయం ఉపాధి పొందుతుండగా.. 76 శాతం మంది నెలవారీ వేతనాలు పొందే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. ఇక గ్రామాల్లో ప్రతి పది మంది కార్మికులకు గానూ ఆరుగురి ఉద్యోగాలు పోయాయి. అంటే 57 శాతం మంది తమ ఆదాయాన్ని కోల్పోయారు. అంతేగాక వేతనాల్లో కోత లేదా మొత్తానికి పొందలేని వాళ్లు 43 శాతం మంది ఉన్నారు. వీరిలో చాలా మంది జీతాలు రూ. 10వేల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
ఆదాయాలు పోయారు…
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు లేక కార్మికులు, రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయేతర స్వయం ఉపాధి కార్మికుల సగటు వారపు ఆదాయాలు రూ.2,240 నుంచి రూ.218 (90 శాతానికి)కి పడిపోయాయి. సాధారణ కార్మికుడి (తాత్కాలికంగా పనిచేసే వ్యక్తి) వారపు ఆదాయం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 940 ఉండగా.. లాక్డౌన్ కాలంలో అది రూ.495కు పడిపోయింది. ఇక రెగ్యులర్ ఉద్యో గుల్లో 47 శాతం మందికి వారి యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేదు.
రైతులదీ అదే వ్యధ
తాము పండించిన పంటల ఉత్పత్తులు కోయడానికి, వాటిని మార్కెట్లలో అమ్మడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటకోత మిషన్లు, కూలీలు అందుబాటులో లేకపోవడంతో పంటలు కోయడం కష్టమైందని సర్వేలో పాల్గొన్న సగం కంటే ఎక్కువ మంది రైతులు చెప్పారు. రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డామని 52 శాతం మంది అన్నదాతలు తెలిపారు.
అద్దెలు కట్టలేం
నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే కార్మికులు, రెగ్యులర్ ఉద్యోగుల్లో చాలా మంది ఇంటి అద్దెలు చెల్లించడానికి అప్పులు చేస్తున్నారు. సుమారు 80 శాతం మంది.. ఇంటద్దెలను వాయిదా వేయాలని ఇంటి యజమానులను కోరామని చెప్పారు. జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉందనీ, ఇంటద్దెలు ఎలా కడతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక గృహవసరాలు తీర్చుకోవడానికి గానూ మిత్రులు, రుణదాతల వద్ద అప్పులు తీసుకుంటున్నామని సుమారు 40 శాతం మంది చెప్పారు. మూడు పూటల తినడాన్నీ తగ్గించామనీ, ఒక పూట పస్తులుంటున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
వారానికి సరిపోయే సరుకులే : సీఎంఐఈ
దేశవ్యాప్తంగా 34 శాతం పేద కుటుంబాల్లో వారానికి సరిపడా సరుకులే ఉన్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) తెలిపింది. ఈ మేరకు అది చేపట్టిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 1/3 వ వంతు కుటుంబాల్లో నిత్యావసరాలు నిండుకున్నాయనీ, అవి వారం రోజులకు మించి రావని సీఎంఐఈ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ కృష్ణన్ తెలిపారు. వాటిని తిరిగి తెచ్చుకోవడానికి వారి దగ్గర ఆర్థిక వనరులు కూడా లేవని ఆయన నివేదించారు. పట్టణాల్లో 65 శాతం కుటుంబాలకు వారానికి సరిపడా సరుకులు ఉన్నాయని తెలపగా.. గ్రామీణ ప్రాంతాల్లో 54 శాతం మంది మాత్రమే తమ వద్ద తగినన్ని నిత్యావసరాలు ఉన్నాయన్నారు. లాక్డౌన్ కారణంగా బీహార్, హర్యానా, జార్ఖండ్లు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ప్రభావితమయ్యాయని సీఎంఐఈ తెలిపింది.
యూనివర్సల్ పీడీఎస్.. జన్ధన్ ద్వారా ఆదుకోండి : నిపుణులు
దేశం మునుపెన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణాన పేద ప్రజలను, కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యూనివర్సల్ పీడీఎస్ ద్వారా పేదల ఆకలి తీర్చాలనీ, జన్ధన్ ఖాతాల ద్వారా వారి ఖాతాల్లోకి ఆర్థిక సాయం అందించాలని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు సురభి కేసర్ అన్నారు. పేదల పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదనీ, కరోనా కంటే ముందే వారు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నా.. దీని నేపథ్యంలో వారి బతుకులు మరింత ఆగమయ్యాయని ఆయన తెలిపారు.
Courtesy: NT