- వడ్డీలు కూడా మీరే కట్టుకోండి
- సెస్ వసూళ్లు ఎన్నాళ్లయినా వాడుకోండి
- జీఎస్టీ పరిహారం మాత్రం ఇవ్వాల్సిందే
- ఆదాయం లేక అల్లాడిపోతున్నాం
- మిగులు ఉన్నపుడు మీరు వాడుకొని
- ఇప్పుడు మమ్మల్ని అప్పు తెచ్చుకోమంటారా?
- కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాం
- ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
హైదరాబాద్ : జీఎస్టీ లోటును భరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నట్లు గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో కేంద్రం తొలిసారిగా సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. జీఎస్టీ లోటును పూడ్చుకొనేందుకు రాష్ట్రాలే అప్పు తీసుకోవాలంటూ కేంద్రం ప్రతిపాదించిన రెండు ఆప్షన్స్ను ఆయన తిరస్కరించారు. కేంద్రమే అప్పు తీసుకొని, రాష్ట్రాల నష్టాల్ని పూడ్చాలని డిమాండ్ చేశారు. అప్పు అసలు వడ్డీ మొత్తాన్ని ఎన్నాళ్లయినా సెస్ వసూళ్ల నుంచే చెల్లించాలని ప్రతిపాదించారు. సెస్ వసూళ్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు ఎన్నేళ్ల వరకు వాడాలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2017-19 మధ్యకాలంలో సెస్ వసూళ్లు కేంద్రం చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం కన్నా ఎక్కువ వచ్చినపుడు ఆ మొత్తాన్ని కేంద్ర ఖజానాలో కలిపి ఖర్చు చేసుకున్నారని లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు లోటు రాగానే రాష్ట్రాలను అప్పులు తెచ్చుకోవాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మేం బలంగా ఉంటేనే!
ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో ఏ మూలన లేదా ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా అది మొత్తం దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని, బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశంగా అవతరిస్తామని అన్నారు. ఎప్పట్లాగే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఏకగ్రీవంగా ఉండేట్లు చూడాలని కోరారు. ప్రధాని సానుకూలంగా స్పందించి, తాను సూచించిన ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో సీఎస్టీ రద్దు వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని కేసీఆర్ ప్రస్తావించారు. కానీ, సీఎస్టీ రద్దు తర్వాత రాష్ట్రాలకు పరిహారం ఇవ్వలేదన్నారు. దాంతో తెలంగాణకురూ.3800 కోట్ల నష్టం జరుగుతోందని చెప్పారు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో రాష్ట్రాలు జీఎస్టీ అమల్లోకి వచ్చే ముందు లోటు పరిహారం విషయాన్ని పట్టుబట్టి రెండు నెలలకు ఒకసారి జీఎస్టీ లోటు పరిహారం ఇచ్చేలా పక్కాగా చట్టంలో చేర్పించాయని తెలిపారు. అయినా జీఎస్టీ లోటు చెల్లింపు తరచూ ఆలస్యం అవుతోందని, 2020 ఏప్రిల్ నుంచి అందలేదని గుర్తు చేశారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
రాష్ట్రాల రెవెన్యూ గణనీయంగా తగ్గుతుంటే తప్పక చేయాల్సిన ఖర్చులు పెరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. 2020 ఏప్రిల్లో కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయంలో 83 శాతం తగ్గిపోయిందని, దీనికితోడు కొత్తగా కొవిడ్ చికిత్సల ఖర్చు పెరిగిందని చెప్పారు. మార్కెట్లో అప్పులు తెచ్చుకోవడం, కేంద్రం నుంచి అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం ద్వారా అతికష్టం మీద ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్నారు. ఆర్థిక విధానాలను కేంద్రం నియంత్రించడంతో మార్కెట్లో అప్పులు చేయడానికి కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు జీడీపీలో 3 శాతం వరకు అప్పులకు అనుమతి ఇచ్చి, కేంద్రం 3.5 ు వరకు అప్పులు తెచ్చుకుంటోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
అనుకున్నదొకటి
జీఎస్టీ రావడంతో రాష్ట్రాలకు వాటా లేని సెస్లు, సర్చార్జిలు క్రమంగా తగ్గిపోతాయని భావించామని, అందుకు విరుద్ధంగా కేంద్రం విదేశాల నుంచి దిగుమతులపై సెస్లు విధించిందని, పెట్రోల్, డీజిల్పై సెస్ను రూ.13 వరకు పెంచిందని ప్రస్తావించారు. పెట్రోలియం ఉత్పత్తులపై ఇలా అదనంగా రూ.2 లక్షల కోట్లు సొమ్ము చేసుకుందన్నారు. కేంద్రమే ముందే పెంచేయడంతో రాష్ట్రాలు కష్టకాలంలో ఆదాయం కోసం పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ పెంచలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
మా త్యాగాలను గుర్తించరా?
జీఎస్టీ కోసం రాష్ట్రాలు ఎన్నో త్యాగాలు చేశాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల పన్ను ఆదాయంలో 47 శాతం జీఎస్టీలో విలీనం కాగా, కేంద్రం నుంచి 31 శాతమే విలీనమైందన్నారు. రాష్ట్రాల వద్ద చెప్పుకోదగ్గ పన్నులేవీ మిగల్లేదని, కేంద్రం వద్ద ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ డ్యూటీల వంటి ఆదాయ మార్గాలు ఉన్నాయని ప్రస్తావించారు. దానికితోడు డివిడెండ్లు వస్తాయని గుర్తు చేశారు.
Courtesy Andhrajyothi