న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికిస్తున్న వేళ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య అంతర్జాతీయంగా 10 లక్షలు దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త మనందరికీ ఎంతో ఊరట కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన జాగ్రత్తలు పాటిస్తూ, సాటి వారికి దూరంగా ఉంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కష్టమేమి కాదని దీని ద్వారా రుజువుతోంది. దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, కొన్ని జాగ్రత్తలతో వైరస్ను ఎదుర్కొవచ్చని కోవిడ్ నుంచి కోలుకున్న ఈ 10 లక్షల మంది ప్రపంచానికి వెల్లడించారు.
తాజా గణంకాల ప్రకారం 33 లక్షల మందిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 10 లక్షల 50 మంది వరకు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్గా తేలిన వారిలో 2 లక్షల 34 వేల మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే వైరస్ను తట్టుకునే శక్తి మనుషుల్లో రోజు రోజుకు పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరణాల రేటు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. భారత్లో కొవిడ్-19 బారిన పడినవారు కోలుకుంటున్నవారి సగటు గురువారం ఉదయం 8 గంటల సమయానికి.. 25.19 శాతంగా ఉండగా.. మరణిస్తున్నవారి సంఖ్య 3.2 శాతంగా ఉంది.
కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 10,95,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 63,871 మరణాలు సంభవించాయి. స్పెయిన్లో 2,39,639 మంది కోవిడ్ బారిన పడగా, 24,543 మంది మృతి చెందారు. ఇటలీలో 2,05,463 కోవిడ్ కేసులు నమోదు కాగా, 27,967 మంది మృత్యువాత పడ్డారు. బ్రిటన్లో 1,71,253 మందికి వైరస్ సోకగా, 26,771 మంది చనిపోయారు. ఫ్రాన్స్లో 167,178 కరోనా కేసుల్లో 24,376 మరణాలు నమోదయ్యాయి.