– కోప్ర
తన ఆయువుపట్టును
గుప్పెట పెట్టుకున్నవాడి మీద
శత్రువుకు అనంతమైన ద్వేషం ఉంటుంది.
అవును! మత విద్వేషకుల ఆయువుపట్టు ఇప్పుడు
మహావిస్ఫోటక విద్యార్థుల చేతుల్లో ఉంది
అందుకే – జేఎన్యూకు ఇన్ని గాయాలు
జామియా నుదుటిపై ఇన్ని నెత్తుటి మరకలు
ఐఐటీ, ఐఐఎం.. అలకు ఇన్ని అలవిగాని అవమానాలు.. యూనివర్సిటీలు, విద్యాలయాలు వ్యాపార సాధనాలను ఉత్పత్తిచేసే కార్ఖానాలుగా, తమ మనువాద ఆచరణకు సాధనాలుగా వర్థిల్లాలని కలలుగనే కమలనాథులకు విద్యార్థిలోకం నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు విసుగు పుట్టిస్తున్నాయి. విద్యార్థిలోకంలో వెల్లివిరుస్తున్న ప్రజానుకూల చైతన్యం చిరాకు పుట్టిస్తోంది. అందుకే.. తమకేమాత్రం సంబంధంలేని, తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని అభాగ్య ప్రజల ఉమ్మడి సమస్యలపై తెగించి కొట్లాడుతున్న మేధో నిలయాలు – భవిష్యత్ హామీలు అయిన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలపై విరుచుకుపడుతున్నది కాషాయదళం. శరీరాలనుంచి తలల్ని వేరుచేసి మొండేలతో మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. దేశ ప్రజల్ని జైళ్లలో కుక్కే స్థితి నుంచి – దేశాన్నే ఒక జైలుగా మార్చే స్థితికి చేరుతున్నది.
ముఖ్యంగా, మేధోమధనానికి నిలయంగా, పీడిత ప్రజానుకూల చైతన్యానికి చిరునామాగా వర్థిల్లుతున్న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) కమలనాథుల కంటిలో నలుసై, పంటికింది రాయై రాచిరంపాన పెడుతున్నది. దేశంలోని అణగారిన కులాలు, పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు మహదావకాశంగా నిలిచిన జేఎన్యూను ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలని కాషాయదళం దశాబ్దాలుగా చేయని ప్రయత్నం లేదు. అయినా జేఎన్యూ లొంగిరాలేదు. దాని ప్రజానుకూల మేధోమధనం నిలిచిపోలేదు. అక్కడ తమ వ్యతిరేక వామపక్ష భావజాలం రోజురోజుకూ బలపడుతున్నది. దేశాన్నంతా చుట్టేశామని, తమ దారికింక అడ్డులేదని, తమ ఆధిపత్యానికి తిరుగులేదనీ విర్రవీగుతూ ఉన్న కమలనాథుల్ని జేఎన్యూ మేధో సవాల్ విసురుతున్నది. దీంతో తిరుగులేని అధికారం తమ చేతనుండి కూడా జేఎన్యూను ఏమీ చేయలేని నిస్సహాయత వారిలో మృగపుటాలోచనలను రేకెత్తిస్తూ ఉంది. జేఎన్యూను ఇలాగే వదిలేస్తే దేశంలోని యావత్ విద్యార్థిలోకం దానినొక ఆదర్శంగా తీసుకునే ప్రమాదముందని భయపడి ఆ బౌద్ధిక కేంద్రంపై భౌతిక దాడులకు బరి తెగించింది. యూనివర్సిటీ యాజమాన్యంతో కుమ్మక్కై, బయటి గూండాలను యూనివర్సిటీలోకి చొప్పించి విద్యార్థుల, అధ్యాపకుల రక్తం కండ్ల జూసింది. యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్పై ఏకంగా హత్యా ప్రయత్నానికి వొడిగట్టింది.
Why ruler’s hate Students!
Tags-india, Why ruler’s hate Students, university thinkers ante establishment, JP movement, Ante Hindi movement, emergency, Mandal commission recomandations implementation, youth dissent against authoritarianism
యావత్ ప్రపంచంతో పాటు మనదేశంలోనూ సామాజిక – రాజకీయ ఉద్యమాలలో విద్యార్థుల పాత్ర గణనీయం. ఆదర్శనీయం. స్వాతంత్య్రానంతర భారతంలో కూడా సామాజిక – రాజకీయ రంగాలలో మార్పులకు విద్యార్థుల చేర్పు సామాన్యమైనదేమీ కాదు. హిందీయేతర రాష్ట్రాలలో ఇంగ్లీష్తో పాటు హిందీని కూడా ఒక అధికారిక భాషగా చేసిన ‘అధికార భాషల చట్టం – 1963’కు వ్యతిరేకంగా 1965లో తమిళప్రజలతో కలిసి నడిచిన విద్యార్థుల వీరోచిత ఉద్యమం (ఈ ఉద్యమంలో 70మంది చనిపోగా 10వేల మంది జైళ్లపాలయ్యారు) ఆ చట్టం రద్దయ్యేలా చేసింది. అంతేకాదు, ఆ చట్టానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని 1967 ఎన్నికలలో చిత్తుగా ఓడించింది. అవినీతి, ఎన్నికల – విద్యా సంస్కరణల కోసం 1974లో బీహార్లో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమం 1975 జూన్ 25 నుంచి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంతో మమేకమై అనన్య త్యాగాలతో 1977 మార్చి 23 వరకూ కొనసాగి ఎమర్జెన్సీ ఎత్తివేతకు ప్రధాన కారణమై 1977 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టి కరిపించి, దేశంలో మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడేందుకు విద్యార్థిలోకం తోడ్పడింది. 1990లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను కాపాడుకొనేందుకు సాగిన మండల్ ఉద్యమం రిజర్వేషన్లను కాపాడుకోవడంలోనూ చురుకైన పాత్ర పోషించింది. అలాగే 2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్విటీ రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం దేశ వ్యాప్తంగా చెలరేగిన విద్యార్థి ఉద్యమం విద్యా – ఉద్యోగ వర్గాలలోని కుల వివక్షపై పోరాటానికి బలమైన పునాది వేసింది.. ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక – రాజకీయాలలో సంభవించిన, సంభవిస్తున్న ప్రతి మార్పులోనూ విద్యార్థుల వీరోచిత ఉద్యమం అంతర్భాగంగా ఉన్నది. వారి సాహసోపేత త్యాగమున్నది.
మీకు కండ్లుండాలి, కానీ
అవి మా వైభవాన్ని మాత్రమే చూడాలి
మీకు కాళ్ళుండాలి, కానీ
అవి మా గమ్యం వైపు మాత్రమే సాగాలి
మీ కంఠాలుండాలి, కానీ
అవి మా నినాదాలను మాత్రమే వల్లించాలి
మీకు ఆలోచనలు ఉండాలి, కానీ
అవి మా ఆధిపత్యం చుట్టే పరిభ్రమించాలి.. అని కాంక్షించే కమలనాధులకు విద్యార్థులు చైతన్యపూరిత కదలిక కంటగింపుగా మారింది. విద్యార్థుల చైతన్యం విద్యాలయాల ప్రహరీలను దాటి పేద, మధ్యతరగతి ప్రజలలోకి కుల – మతాలకతీతంగా ప్రవహించడం.. వారిలో మనోస్థైర్యాన్ని నింపి, మానవీయతను, సంఘీభావాన్నీ, సంఘటితత్వాన్నీ రేకెత్తించడం కమలనాథులను బెంబేలెత్తిస్తూ ఉంది. ”మేం మా పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలను ఎక్కడినుండి తేవాలి?.. మమ్మల్ని మత ప్రాతిపదిక మీద విభజిస్తున్నారు. ఒకవేళ పౌరసత్యాన్ని నిరూపించు కోవడంలో విఫలమైతే మమ్మల్ని నిర్బంధ కేంద్రంలో పెట్టడమో, లేదా దేశం నుంచి బహిష్కరించడమో జరుగుతంది. కాబట్టి మా హక్కుల కోసం ఇప్పుడే పోరాటం చేయడం ఉత్తమం” అంటూ వందేండ్ల చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోనంత చలిలో ఢిల్లీ షాహీన్బాగ్లో నడివీధిలో చేస్తున్న మహిళలు చేస్తున్న నిరవధిక ధర్నాలు, వాటికి సంఘీభావంగా వందలాదిమంది హిందూ మహిళలు వీధుల్లోకి రావడం వెనుక వారి పొరుగునే ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థుల చైతన్య ప్రవాహం అంతర్భాగంగా ఉంది. ఈ ఆరేండ్ల అధికార కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ తన స్వరం మార్చి ”పౌరసత్వాన్ని కల్పించడమే తప్ప ఎవరి పౌరసత్వాన్ని తొలగించడం తమ ఉద్దేశం కాదని” తగ్గి మాట్లాడుతున్నారంటే అందుకు విద్యార్థి ఉద్యమం కూడా ఒక కారణమన్నది సత్యం.
బాధ్యతాయిత ఉన్నత స్థానంలో ఉన్న మోడీ మాటలకు ప్రజలు విలువివ్వడంలేదు. కనీసం నమ్మడం లేదు. అందుకు ఆయన నడిచివచ్చిన గతం, నమ్ముకున్న సిద్ధాంతమే కారణం. పైకి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ముసుగులు ధరించుకున్నా, ‘ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే కమలనాథుల అంతిమ ధ్యేయమన్నది’ తిరుగులేని సత్యం. అందుకే మతాన్ని రాజకీయాలతో రంగరించారు కమలనాథులు. మతాధారిత రాజకీయాలకు తెరలేపారు. ”మతం అనేది ప్రవర్తనా నియమం లాంటిది. ఏం చేయాలో, ఏం చేయకూడదో మతం మనకు నేర్పిస్తుంది. ప్రజలకు మార్గనిర్దేశనం చేస్తుంది. మంచి-చెడులను విడమరిచి చెబుతుంది. మతం ఊసులేని రాజకీయాలు అర్థరహితం. అవి రెండూ కలిసే ఉండాలి” అని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కుండబద్దలు కొట్టారు.
విభిన్న మతాల సమ్మేళనమైన దేశంలో, వేలాది కులాల సమ్మేళనమైన హిందూ మతాధారిత రాజకీయాలు నడపాలంటే బలమైన శత్రు మతాన్ని సృష్టించాలి. ప్రజల దృష్టిని, వారి ఆలోచనలను ఆ శత్రు మతంవైపు మళ్లించాలి. దాని చుట్టే తిప్పాలి. ఇది ఏమాత్రం వేడి తగ్గినా, బడాపారిశ్రామికవేత్తల పంచనజేరి, వారికోసమే పనిచేస్తున్న పాలకుల వ్యవహారం కూడా ప్రజలు ప్రశ్నిస్తారు. అదే జరిగితే ప్రజాపోరాటాలు తప్పవు. అంతేకాదు, తమ మతంలోని అంతర్గత వైరుధ్యాలు బయట పడతాయి. ఒక్కసారి హిందూ మతంలోకి కుల వైరుధ్యాలు, వివక్షలు బయట పడితే, చర్చనీయాంశం అయితే మొదటికే మోసమొస్తుంది.. కాబట్టే కాక తగ్గకుండా కసరత్తులు చేస్తున్నారు కమలనాథులు. ఎప్పటి కప్పుడు, ఎలాంటి అవకాశాన్ని విడవకుండా, అవకాశం లేకుంటే తామే సృష్టించుకుని హిందూ ప్రజలలో ముస్లింల పట్ల విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. హిందూ ప్రజలు అనుభవిస్తున్న సమస్త బాధలకూ ముస్లింలే కారణమని నమ్మించేందుకు కనీవినీ ఎరుగని విధంగా కట్టుకథలను సృష్టిస్తున్నారు. సృష్టించి గోబెల్స్కు మించిన స్థాయిలో ప్రజల మధ్యలోకి వదిలి, వారి మెదళ్లలోకీ ఎక్కిస్తున్నారు. ‘ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజమైపోతుంది’ అన్న గోబెల్స్ ఎత్తుగడను అక్షరాలా పాటిస్తున్నారు.
పార్లమెంటులో తమకున్న మూక బలంతో ‘భౌతిక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారం’ చూపే ఎత్తుగడను వేగిరం చేసారు. ప్రజా పీడకుల ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ ప్రజల భౌతిక సమస్యలకు భౌతిక పరిష్కారాలను ఎన్నటికీ చూపలేదు. దానికది సాథ్యం కాదు. కాబట్టి, ప్రజల ఆలోచనలను అది ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తుంది. ప్రజల భౌతిక సమస్యలకు కారణమైన దోపిడీదారుల మీదనుండి దృష్టి మరల్చి, అన్య మతస్తులపై కేంద్రీకరిస్తుంది. పీడిత ప్రజల అసలు శత్రువులైన దోపిడీదారుల స్థానంలో అన్యమతస్తులను ప్రతిష్టించి వారితో యుద్ధం చేయమంటోంది. ఆ యుద్ధంలో ఎవరు ఓడి ఎవరు గెలిచినా తమ ఆధిపత్యం మాత్రం సుస్ధిరమని కలలు కంటోంది. ఈ నేపథ్యంలో.. వారి కలలు కల్లలు చేసే సామర్థ్యం ఉన్న శత్రు మూకగా వారికి ఇప్పుడు విద్యార్థిలోకం అభ్యుదయ భావాలు కనిపిస్తున్నాయి. అందునా, ఇప్పుడు విద్యార్థిలోక ప్రధాన నాయకత్వం తమను సిద్ధాంతపరంగా చిత్తుచేయగల వామపక్షీయుల చేతుల్లో ఉంది. ‘కమలనాథులు సృష్టిస్తున్న సమస్యలు కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైనవి కావు. అవి మనందరివి. ఈ దేశంలోని సమస్త పీడితులవి’ అని ప్రజలు గుర్తిస్తే ఆపై తమ ఆటలు సాగవు. తమ అధికారానికి, ఆధిపత్యానికీ శాశ్వత సమాధిలేస్తుంది. ఆ దిశలోనే నడుస్తున్నదే ఈ విద్యార్థి ఉద్యమం. అందుకే కమలదళం ఇప్పుడు విద్యార్థిలోకంపై విరుచుకుపడుతున్నది. ప్రజానుకూల విద్యార్థి లోకాన్ని ప్రాణపదంగా కాపాడుకుందాం!
Courtesy: NT