- సెప్టెంబరునెల జీతం రావాలి
- సమ్మె కాలం వేతనం తేలాలి
- ప్రభుత్వం నుంచి రాని స్పష్టత
- 100 కోట్లను వాడాలని డిమాండ్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడం, చార్జీలు పెంచుకునే అవకాశమివ్వడం, రూ.100 కోట్లను తక్షణమే చెల్లించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం… కార్మికుల వేతనాల గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కొంత ఆందోళన నెలకొంది. పని చేసిన కాలానికి సంబంధించిన వేతనంపై సర్కారు మౌనం వహించడం, సమ్మె కాలం నాటి వేతనాలను ఏదో ఒక సెలవుల నుంచి సర్దుబాటు చేస్తామనే ప్రకటన వెలువడక పోవడంతో అసలు వేతనాలు చెల్లిస్తారా? అని కార్మికులు సందేహపడుతున్నారు.
సెప్టెంబరులో కార్మికులు పూర్తి స్థాయిలో పని చేశారు. ఈ నెలకు సంబంధించిన వేతనాలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. పని చేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని వేతనాల చెల్లింపు చట్టం చెబుతోంది. ఆర్టీసీలోని 49 వేల మందికి వేతనాలకు 110 కోట్లు అవసరమవుతాయి. కార్పొరేషన్ వద్ద ప్రస్తుతం కేవలం 13 కోట్లు ఉన్నాయి. ఆర్టీసీకి తక్షణమే రూ.100 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఈ డబ్బును సెప్టెంబరు వేతనాల కోసం సర్దుబాటు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 52 రోజుల పాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలం వేతనాలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతాఇవ్వలేదు. వీటిని చెల్లిస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. 2011లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు అందలేదు.
Courtesy AndhraJyothy…