ఉ.సా.గా సుప్రసిద్ధుడైన ఉ.సాంబశివరావు ఈ వేకువన కరోనాతో కన్నుమూశారు. ఆయనది సుమారు ఐదు పదుల పోరాట జీవితం. 1970లలో విద్యార్థి ఉద్యమంతో ఆరంభించి యుసీసీఆర్ ఎంఎల్ విప్లవ నిర్మాణంలో భాగమయ్యారు. కొండమొదలు పోరాట ఉత్తేజంతో విప్లవోద్యమంలోని వేర్వేరు రంగాల్లో పని చేశారు. కార్యకర్తగా, పాటల రచయితగా, మేధావిగా, ఉపన్యాసకుడిగా ప్రభావశీలమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. విప్లవ నిర్మాణం నుంచి బైటికి వచ్చాక కారంచేడు పోరాటం దగ్గరి నుంచి దళిత బహుజన పోరాటాలకు సైద్ధాంతిక, ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించారు. కార్యకర్తగా అనుక్షణం ప్రజా జీవితాన్ని గడిపారు. గత ముప్పై ఐదేళ్లుగా తెలుగు నేల మీద రూపొందుతున్న సామాజిక పోరాట ప్రపంచంలో ఆయన గుర్తించదగిన వ్యక్తి. మార్కిస్టు సిద్ధాంతం, వర్గపోరాట ఆచరణ, చైతన్యం పునాది మీద బయల్దేరిన ఆలోచనాపరుడిగా ఆయన సామాజిక విముక్తి సిద్ధాంతాన్ని తీర్చిదిద్దే విషయంలో తనదైన గంభీరమైన కంఠస్వరాన్ని వినిపించారు.
దళిత బహుజన ఉద్యమాల్లో సిద్ధాంత పటుత్వమున్న నాయకుల్లో ఆయన పాత్ర గణనీయమైనది. దీనితోపాటు ఆయన నిత్యం పోరాటాల్లో ఉంటూ వేర్వేరు పీడిత అస్తిత్వాల పోరాటాలను నిర్మాణయుతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కారంచేడు, చుండూరు, వేంపెంట దగ్గరి నుంచి లక్ష్మింపేట దాకా ఎక్కడ దళిత బహుజనులపై, ముస్లింలపై దాడులు జరిగినా, ఆత్మగౌరవ ధిక్కారం వినిపించినా ఆయన అక్కడ ఉండేవారు. మార్క్సిస్టు లెనినిస్టు సెంటర్, ఎదురీత పత్రిక దగ్గరి నుంచి దళిత బహుజన ఉద్యమాలను సంఘటితం చేయడానికి అనేక నిర్మాణ ప్రయోగాలు చేశారు. బహుజన రిపబ్లికన్ పార్లీ, మహాజన సమితి, మహాజన పార్టీ వంటి సంస్థలను, పార్టీలను నిర్మించారు. నిర్మాణాలు లేకుండా ఉద్యమ లక్ష్యాలు నెరవేరవనే అవగాహనతోనే ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేశారు.
పీడిత దళిత, బహుజన కులాలు, జండర్, వెనుకబడిన ప్రాంతాలు, మైనారిటీ మతాలు, కశ్మీర్ లాంటి జాతుల ఆకాంక్షలన్నిటినీ వినిపించగల గొంతుక ఆయనది. తాను అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల కూడలిగా ఉండటమేగాక ఉద్యమ చర్చలకు, సిద్ధాంత కల్పనకు వేదికగా పత్రికలను కూడా స్థాపించి మిత్రులతో కలిసి నిర్వహించారు. ఆనాటి ఎదురీత, ఏకలవ్య దగ్గరి నుంచి ఇటీవలి కాలంలో దేశీ దిశ అనే యూట్యూబ్ చానల్ దాకా అనేక ప్రయత్నాలు మిత్రులతో కలిసి చేశారు. ఈ దిశగా ఆయన అనేక రాజకీయ, సిద్దాంత, చారిత్రక విశ్లేషణ వ్యాసాలు రాశారు. ఆలోచనాత్మక ప్రసంగాలు చేశారు. ఆయన సంకలనం చేసిన పుస్తకాల్లో దళిత రణన్నినాదం దళిత పోరాటాల చరిత్ర రచనకు దోహదం చేస్తుంది. పూలే తృతీయరత్న పుస్తకంలాంటి వాటికి రాసిన ముందుమాటల్లో చాలా విలువైన అంశాలు ఉన్నాయి.
విప్లవోద్యమాల మీద విమర్శనాత్మక వైఖరితోనే వర్గ-కుల పోరాటాల సమన్వయానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. పూలే అంబేద్కర్, మార్క్స్ సమన్వయానికి కూడా ఆయన సిద్ధాంత తలంలో కృషి చేశారు. ఈ క్రమంలో అమరుడు వీరన్న నేతృత్వంలోని విప్లవ నిర్మాణానికి సన్నిహితంగా భావజాల, రాజకీయ రంగంలో పని చేశారు. సమగ్ర విముక్తి లక్ష్యంతో సాగే వర్గపోరాటాలను, కుల నిర్మూలన ఉద్యమాలను మేళవించాలనే అవగాహన ఉన్నందు వల్లనే సామాజిక హింస, రాజ్యహింస వ్యతిరేక పోరాటాలన్నిటిలో ఉసా ముందుండేవారు. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఎన్ కౌంటర్ హత్యలు, అక్రమ అరెస్టులు మొదలైన వాటికి వ్యతిరేకంగా మాట్లాడేవారు.
ఈ క్రమమంతా ఆయనలోని నిరంతర అన్వేషణ ఫలితమే. వర్గ కుల పోరాటాల ఉమ్మడి క్షేత్రం నుంచి ఆయన మేధో, ఆచరణ వ్యక్తిత్వం రూపొందింది. దేశీయ తాత్విక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని ఎత్తిపట్టే క్రమంలో మనదైన సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోడానికి అనేక సూత్రీకరణలు చేశారు. ఆ రకంగా ఆయన దళిత బహుజన విముక్తి పోరాటానికి బలమైన సాంస్కృతిక కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. ఆయన వైఖరుల్లో కొన్ని చర్చదగినవే కావచ్చు, వాటన్నిటినీ ఆయన ఈ దేశ సామాజిక పరివర్తనకూ, సమూల విప్లవానికి అత్యవసరమైనవనే విశ్వాసంతో ప్రకటించారు. అది నిజాయితీతో కూడిన అన్వేషణ దృష్టి. అది చాలా అత్యవసరమైనది. విలువైనది.
సంఘ్ పరివార్ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా జరగాల్సిన సామాజిక, సాంస్కృతిక పోరాటాల్లో చాలా కాలంగా ఆయన ముందున్నారు. భీమా కొరేగావ్ కుట్ర కేసు దగ్గరి నుంచి సీఏఏ వ్యతిరేక పోరాటం, కశ్మీర్ జాతి ఆకాంక్షల పోరాటం దాకా ఇటీవల ఆయన ముమ్మరంగా భాగస్వామి అయ్యారు. విరసం కార్యదర్శి కా. కాశీం అరెస్టు సందర్భంలో హైదరాబాదులో జరిగిన సభలో ఆయన హిందుత్వ ఫాసిజానికి ఉన్న అనేక కోణాలు విశ్లేషిస్తూ ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం సీఏఏ, ఎస్ఆర్ సీలను తేవడం, వాటిని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులపై నిర్బంధం తేవడం, దేశవ్యాప్తంగా దళితులపై, ముస్లింలపై హత్యాకాండ కొనసాగించడం, విప్లవాభిమానులపై, కార్యకర్తలపై తీవ్ర అణచివేత కొనసాగిస్తుండటం అన్నీ పెరిగిపోతున్న ఫాసిజానికి నిదర్శనాలని వివరించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పీడిత అస్తిత్వ పోరాటాలు, విప్లవోద్యమాలు, ఉదారవాద ప్రజాస్వామిక శక్తులు ఐక్యమవుతున్న సమయాన ఆయన అవసరం చాలా ఉన్నది. ఆయన చేయగల పనులు ఎన్నో ఉన్నాయి. ఈ అత్యవసరమైన తరుణంలో ఆయన హఠాన్మరణం ఉద్యమ శక్తులకు తీరని నష్టం. ఆయన విప్లవ సాహిత్యోద్యమానికి, విప్లవోద్యమానికి చిరకాల మిత్రుడు.
ఆయన చైతన్యవంతమైన ఆచరణ, సిద్ధాంత కృషి, ప్రజాస్వామిక మానవీయ వ్యవహారశైలి, తీక్షణమైన కంఠస్వరం, నిర్దిష్ట వాదనాశైలి, పీడిత ప్రజల కోసం సాగించిన కఠోర ఆచరణ అన్నీ మూడు తరాల విప్లవ, ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాల ప్రతిఫలనం. ఆయన ఆ ఉద్యమాల ప్రభావాల నుంచి రూపొందారు. వాటికి అనేక రకాలుగా దోహదం చేశారు. వాటిని ప్రభావితం చేశారు. ఆయన అచంచల కృషికి విరసం నివాళి ప్రకటిస్తోంది. లాల్ సలాం చెబుతోంది.
అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షుడు
బాసిత్, విరసం ఉపాధ్యక్షుడు
రివేరా, విరసం సహాయ కార్యదర్శి