తన అద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. రెండేళ్ల పాటు క్యాన్సర్తో పోరాడి తుదిశ్వాస విడిచారు.
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) కన్నుమూశారు. 2018 మార్చి నుంచి న్యూరో ఎండోక్రైన్ కేన్సర్తో బాధపడుతున్న ఆయన.. పెద్ద పేగు ఇన్ఫెక్షన్తో బుధవారం మధ్యాహ్నం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం ఇర్ఫాన్ తల్లి సయీదాబేగమ్ (95) జైపూర్లో మరణించారు. లాక్డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. వీడియో కాల్ ద్వారా తల్లికి కడసారి నివాళులర్పించారు. అంతేకాదు.. బుధవారం మధ్యాహ్నం తాను చనిపోయే కొన్ని క్షణాల ముందు తన భార్యతో.. ‘నేను చనిపోవడం ఖాయమని నాకు తెలుస్తోంది. అమ్మ ఈ గదిలోనే ఉంది. చూడు, అమ్మ నా పక్కనే ఉంది. నన్ను తీసుకెళ్లడానికి వచ్చింది’ అంటూ ఆయన కన్నుమూసినట్టు సమాచారం. ఇర్ఫాన్కు భార్య సుతాప సిక్దర్, ఇద్దరు కుమారులు బాబిల్ ఖాన్, అయాన్ ఖాన్ ఉన్నారు. కేన్సర్తో ఆయన చివరి దాకా పోరాడారని.. చివరి క్షణాల్లో తనను ఎంతగానే ఇష్టపడేవారితో గడిపారని కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఇర్ఫాన్ఖాన్.. మీరా నాయర్ ‘సలామ్ బాంబే’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. తొలినాళ్లలో చాణక్య, భారత్ ఏక్ ఖోజ్, చంద్రకాంత లాంటి చారిత్రక ఇతివృత్తాలతో రూపొందించిన సీరియల్స్లో నటించారు. గ్రేట్ మరాఠా, డర్, జస్ట్ మెహబ్బత్, జై హనుమాన్, బాంబే బ్లూ సీరియల్స్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. పాన్ సింగ్ తోమర్ (2011) సినిమాలో నటనతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా పొందిన ఇర్ఫాన్ఖాన్.. లైఫ్ ఆఫ్ పై, హాసిల్, మఖ్బూల్, ద లంచ్ బాక్స్, పీకూ వంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. అంతేకాదు.. స్లమ్డాగ్ మిలియనీర్, ఇన్ఫెర్నో, ద జురాసిక్ వరల్డ్, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్, ఎ మైటీ హార్ట్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి సత్తా చాటారు. తెలుగులో ఆయన మహేష్ బాబు ‘సైనికుడు’ చిత్రంలో విలన్గా నటించారు.
ఇర్ఫాన్ఖాన్ కేన్సర్తో బాధపడుతున్న సంగతి 2018 మార్చిలో తెలిసింది. 2019 ఫిబ్రవరి దాకా ఆయన లండన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. భారత్కు వచ్చాక.. ‘అంగ్రేజీ మీడియం’ హిందీ చిత్రంలో నటించారు. అదే ఆయన నటించిన చివరి చిత్రం. కాగా.. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా కబరస్థాన్లో ఇర్ఫాన్ అంత్యక్రియలు ముగిశాయి. ఇర్ఫాన్ఖాన్ మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సంతాపం తెలిపారు. ఇర్ఫాన్ఖాన్ అద్భుత నటుడని, వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆయన ప్రేక్షకుల మదిలో చిరకాలం ఉండిపోతారని సంతాప సందేశాల్లో అందరూ పేర్కొన్నారు.