- వెల్లడించిన జేజే ఆస్పత్రి వైద్యులు
- వరవరరావు ప్రాణాలు కాపాడండి
- ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ అధిర్ చౌదరి లేఖ
కోల్కతా/ముంబై/హైదరాబాద్ : ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కవి వరవరరావుఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తున్నామని ఆయన కోలుకుంటున్నారని వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్యంపై పూర్తి అంచనాకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.
రెండేళ్లుగా తలోజా జైలులో ఉంటున్న వరవరరావు సోమవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన కవి వరవరరావును విడుదల చేసేందుకు చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. వరవరరావుతో దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని చౌదరి అన్నారు. 81 ఏళ్ల వృద్ధుడు నేరం రుజువు కాకున్నా ఏళ్లుగా జైలులో మగ్గుతున్నాడని, ఆయనకు సరైన వైద్య సహాయం లేదని, ప్రస్తుతం వరవరరావు మానసికంగా స్థిరంగా లేరని అధిర్ పేర్కొన్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు. వరవరరావును వెంటనే విడుదల చేయాలని మంగళవారం సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యానగర్ మార్క్స్ భవన్ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఆయనకు మెరుగైన వైద్యసేవలు అందించాలని నేతలు డిమాండ్ చేశారు. వరవరరావును తక్షణం విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయనకు కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యం అందించాలని కోరారు.
Courtesy Andhrajyothi