- యూరియా క్యూలో ప్రాణం కోల్పోయిన వృద్ధ రైతు
- 3 రోజులుగా పడిగాపులు.. అయినా దొరకని బస్తా
- భార్య చూస్తుండగానే కూలిన రైతు
- దుబ్బాక మండల కేంద్రంలో విషాదం
- బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం
- రాష్ట్రానికి అదనపు యూరియా
- కొరతకు కేంద్రమే కారణం: గుత్తా
పంటకు సరైన పంగిలో యూరియా చల్లకపోతే ఎదగదు. ఆలస్యమైతే దిగుబడికే గండి. మరి.. యూరియానేమో ఎక్కడా దొరుకుత లేదు ఎట్లా? 3 రకాలైన పంటలు వేసిన ఆ వృద్ధ రైతుకు కొన్నాళ్ల నుంచి ఇదే రంది పట్టుకుంది. యూరియా కోసం పొద్దున్నే మండలకేంద్రానికొచ్చి దాదాపు అరకిలోమీటరు మేర ఉన్న లైన్లో నిలబడ్డాడు. కాళ్లు గుంజుతున్నా.. వృద్ధాప్య సమస్యలతో ఒళ్లు సహకరించకున్నా ఆ బాధనంత పంటిబిగువున భరిస్తూ నిల్చున్నాడు. పొద్దున్నుంచి రాత్రి దాకా అలాగే నిలబడినా తన వంతు రాకముందే యూరియా బస్తాల స్టాకు అయిపోయింది.
తెల్లారి మళ్లీ వచ్చిండు. మళ్లీ అదే పరిస్థితి. ఖాళీ చేతులతో ఇంటికి పోయిండు. ఇలానే రెండు రోజులు గడిచాయి. సరైన తిండి, నిద్రలేదు. అయినా యూరియా దొరుకుతుందనే ఆశ చావక ఆ ముసలాయన మూడోరోజూ వచ్చిండు. అలసట, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బంది పడుతున్నా చాంతాడంత క్యూలో నిల్చునే ఉన్నాడు. అలా నిలబడిన వృద్ధుడు.. నిలబడ్డట్లే లైన్లో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు!
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుడు.. దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామానికి చెందిన చేరువపురం ఎల్లయ్య (69). పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లయ్యకు భార్య లచ్చమ్మ.. నలుగురు కూతుళ్లు శ్యామల, నరసవ్వ, రేణుక, మమత ఉన్నారు. రెండెకరాల పొలం ఉంది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ నాలుగు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలను సాగు చేశాడు. ఇటీవల వర్షాలు బాగా పడటంతో పంటలకు యూరియా అవసరమైంది. ఆ బస్తాల కోసం ఎల్లయ్య మూడు రోజులుగా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వచ్చి పడిగాపులు పడుతున్నాడు.
గురువారం కూడా ఉదయాన్నే భార్య లచ్చమ్మతో కలిసి కేంద్రానికి వచ్చాడు. పురుషుల లైన్లో ఎల్లయ్య, మహిళల లైన్లో లచ్చమ్మ నిల్చున్నారు. క్యూ లైన్ చాలా దూరం ఉండటంతో ఎల్లయ్య.. గంటన్నర పాటు లైన్లోనే నిలబడ్డాడు. లచ్చమ్మ చూస్తుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన సొమ్మసిల్లి కిందపడ్డాడు. ఆయన్ను లైన్లో నిలబడ్డ రైతులు దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
1.25లక్షలిచ్చిన ఎమ్మెల్యే సోలిపేట
మృతుడి కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి రూ. 1.25 లక్షలను అందించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్రావు, పీసీసీ ప్రచార కార్యదర్శి వేంకట నర్సింహారెడ్డి పరామర్శించారు. ఎల్లయ్య మృతి.. ప్రభుత్వ హత్యేనని వారు ఆరోపించారు.