– సీఏఏకు నిరసనగా ఉర్దూకవి ముజ్తబ హుస్సేన్ నిర్ణయం
హైదరాబాద్ : పౌరసత్వ (సవరణ) చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా మేధావులు, కవులు, కళాకారులు కేంద్రప్రభుత్వం గతంలో తమకు ఇచ్చిన అవార్డులను తిరిగిచ్చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఉర్దూ కవి ముజ్తబ హుస్సేన్ చేరారు. సీఏఏను నిరసిస్తూ కేంద్రం తనకు ఇచ్చిన పద్మశ్రీని తిరిగి ఇచ్చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నేను పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ఇప్పుడు దాడికి గురైంది. ప్రభుత్వమే అది చేస్తుంది. అందుకే ఈ ప్రభుత్వంతో అనుసంధానంగా ఉండటం నాకు ఇష్టం లేదు’ అని తెలిపారు. ఇప్పటికే సీఏఏను నిరసిస్తూ మహారాష్ట్రకు చెందిన శిరిన్ దల్వి, యూపీ వాసి అయిన యాకూబ్ యవార్ తమకు వచ్చిన అవార్డులను తిరిగిచ్చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, 83 ఏండ్ల హుస్సేన్.. ఉపఖండంలోనే కీర్తిగాంచిన ఉర్దూ కవి. ఆయన రాసిన రచనలు పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు గానూ 2007లో ఆయన పద్మశ్రీని పొందారు.
Courtesy Nava telangana