– ‘అన్లాక్’తో పలుదేశాల్లో కేసుల తగ్గుదల.. భారత్లో పూర్తి వ్యతిరేకం
– సడలింపుల తర్వాత విజృంభిస్తున్న వైరస్
– పాజిటివ్ కేసుల్లో ప్రపంచంలో నాలుగో స్థానం
– నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన దానికి మూల్యం
– కలవరపెడుతున్న వలస కూలీల వెతలు
‘కరోనా అంటే…. కోయి రోడ్ పర్ న నిక్లే (ఎవరూ రోడ్లపైకి రావొద్దు).. ఈ 21 రోజుల్లో స్వీయ నియంత్రణ పాటించకుంటే మనం 21 ఏండ్లు వెనక్కివెళ్తాం. ఈ 21 రోజుల్లో దీన్ని ఆపకపోతే మీ కుటుంబాలు సర్వనాశనమవుతాయి. ఇండ్ల గుమ్మాల ముందు లక్ష్మణ రేఖ గీసుకొని దానిని దాటి రాకండి. బయటి ప్రపంచాన్ని మరిచిపోండి..’ లాక్డౌన్ విధించడానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగమిది. మార్చి 24 రాత్రి 8 గంటలకు లాక్డౌన్ ప్రకటించేనాటికి భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 519. సుమారు 65 రోజుల పాటు కర్ఫ్యూ లాంటి పరిస్థితులు. కట్చేస్తే.. దేశంలో పాజిటివ్ల సంఖ్య నానాటికీ విజృంభిస్తున్నది. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్డౌన్ విధించేనాటికి కేసుల సంఖ్య పెరిగినా.. సడలింపులు ఇచ్చే సమయానికి అవి తగ్గుముఖం పట్టాయి. కానీ భారత్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కరోనా కేసుల్లో ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్నాం. మరి మన దేశంలో అంత కఠినమైన లాక్డౌన్ ఎందుకు విఫలమైంది..?
న్యూఢిల్లీ : ప్రపంచ మహమ్మారి కోవిడ్-19కు అన్ని దేశాలూ విలవిల్లాడుతున్నా.. పటిష్టమైన చర్యలతో కొన్ని దేశాలు దానిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. ముందు కరోనాను తక్కువగా అంచనావేసిన ఇటలీ, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాలు తర్వాత తేరుకుని దాని వ్యాప్తిని నివారిస్తున్నాయి. ఈ దేశాల నుంచి అరువు తెచ్చుకున్న లాక్డౌన్ను విధించిన భారత్లో మాత్రం కేసులు నానాటికీ విజృంభిస్తున్నాయి. లాక్డౌన్ను అత్యంత కఠినంగా అమలుచేస్తున్న దేశం భారతేననీ మోడీ అనుకూల మీడియా కోడై కూసినా.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో కేసుల రెట్టింపు (డబ్లింగ్ రేట్) సంఖ్య తక్కువగా ఉన్నదని మోడీ ప్రభుత్వం సమర్థించుకుంటున్నా దీని బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే దీనికి మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలే దేశంలో కేసుల సంఖ్య పెరగడానికి కారణమని పలురంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రణాళిక లేకుండా 130 కోట్ల మంది ఉన్న దేశంలో నాలుగు గంటల సమయమిచ్చి లాక్డౌన్ను విధించడం అనేది ఒక పీడకల లాంటిది. ఈ కారణంగా కోట్లాది మంది వలసకార్మికులు, అసంఘటితరంగ కార్మికులు పడుతున్న వెతలు దేశం కండ్లారా చూస్తూనే ఉన్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన లక్షలాది మంది వేతనజీవులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని అభాగ్యజీవుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి.
ఇదే విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖలో పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారి జవహర్ సిర్కర్ స్పందిస్తూ.. ‘మోడీకి సంప్రదింపుల మీద నమ్మకం లేదు. ఆయన ప్రభుత్వం కొంతమంది వంధిమాగాధులు చెప్పినట్టు నడుస్తున్నది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేప్పుడు బ్యూరోక్రాట్లతో, క్యాబినెట్లో చర్చించి.. సమాజం నుంచి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు వినాలి. అవేమీ లేకుండా చేసిన దానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఇది. వలస కార్మికులను చూడండి. ఎన్ని కష్టాలు పడుతున్నారో..! లాక్డౌన్ విధించేనాటికి వారిని తరలించడానికి కనీస ప్రణాళికలు ఏమైనా చేశారా..? దీంతో అదో పెద్ద సంక్షోభంగా పరిణమించింది. సాధారణంగా పనిచేస్తున్న చోట పని దొరకపోతేనే కార్మికులు వలస వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. దేశాన్ని ప్రభావితం చేసే ఈ నిర్ణయం తీసుకునే ముందు కార్మికులకు షెల్టర్లు ఏర్పాటు చేసి, వారి చేతికి నగదు, నిత్యావసరాలు అందిస్తే ఇది పెద్ద సమస్య కాకపోయేది. కానీ ఈ సర్కారు అలా చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే అసలీ దేశంలో కార్మిక శాఖ, దానికి మంత్రి ఉన్నారా..? అని అనుమానం కలుగుతున్నది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ అత్యంత విఫల ప్రక్రియ అని ఆయన అభిప్రాయపడ్డారు.
శాస్త్రీయ దృక్పథం లేకుండా దేశంలో నామమాత్రంగా ఉన్న వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా నొక్కిచెబుతున్నది. కానీ దీని నుంచి పాలకులు గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సుజోరు సన్యాల్ అంటున్నారు. లాక్డౌన్ను శాస్త్రీయ దృక్పథం లేకుండా అమలుచేశారనీ, సడలింపులూ అదే విధంగా ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా సన్యాల్ మాట్లాడుతూ.. ‘కరోనా కేసుల గురించి ప్రస్తావన వస్తే.. ఇటలీ, స్పెయిన్, ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో దాని వ్యాప్తి తక్కువని సర్కారు చెబుతున్నది. కానీ ఆ దేశాల్లో వృద్దుల సంఖ్య అధికం. అంతేగాక అక్కడి వాతావరణ పరిస్థితులు. భారత్ లో యువ జనాభా ఎక్కువ. ఇక్కడ వీరికి సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి కూడా వ్యాప్తి త్వరగా సంక్రమణ కాకపో వడానికి ఓ కారణం. అందుకే విదేశాలతో పోలిస్తే మనకు మృతుల సంఖ్య తక్కువగా ఉంది.
అయితే దేశంలో లాక్డౌ న్ను విధించడం, సడలింపులు ఇవ్వడం.. రెండు కూడా శాస్త్రీయ దృక్పథం లేకుండా చేశారు. పదిహేను రోజుల తర్వాత లాక్డౌన్ విధించి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. అంతేగాక ప్రపంచంగా ఎక్కడైనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడితేనే అప్పుడు సడలింపులు ఇస్తున్నారు. కానీ మనదేశంలో మాత్రం అలాంటి ప్రమాణాలేమీ పాటించడం లేదు’ అని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో ఉన్నవారిని పల్లెలకు అనుమతించి గ్రామాలకు వైరస్ను సంక్రమింపజేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా వైద్యరంగాన్ని పటిష్టపరచడానికి పాలకులు యత్నించడం లేదని ఆయన ఆగ్రహించారు. వైద్య సంక్షోభం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే విషయాన్ని మరువరాదని ఆయన హితబోధ చేశారు.
సామాజిక భద్రతను మరిచారు
లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, పేద ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే వారికి సామాజిక భద్రతను కల్పించడంలో కేంద్ర సర్కారు ఘోరంగా విఫలమైంది. పనులేమీ లేక, నిత్యావసరాలు కొనే శక్తి లేక.. పేదలు ఆకలికి అలమటిస్తున్నా, గిడ్డంగుల్లో ఉన్న నిల్వలను పేదలను పంచడానికి మాత్రం కేంద్రం ససేమిరా అంటున్నది. ఇదే విషయమై ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ డి. చక్రవర్తి మాట్లాడుతూ.. ‘మండుటెండల్లో రక్తాలు కారుతున్నా సొంత ఇంటికి చేరడానికి వలసకార్మికులు పడ్డ బాధలు మనను ఇప్పటికీ ఒత్తిడికి గురి చేస్తూనే ఉన్నాయి. వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించి ఉంటే బాగుండేది. నిర్దిష్ట ప్రణాళికతో లాక్డౌన్ ప్రకటించి.. కార్మికులు వారి సొంత ఇండ్లకు వెళ్లడానికి అనుమతినిస్తే వారికి ఈ బాధలు తప్పేవి’ అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే వారికి ఆహార భద్రతను కల్పించాల్సిన అవసరాన్ని ఆమె గుర్తుచేశారు.
పూర్తి విరుద్ధం..
మోడీ సర్కారు అత్యంత హడావుడిగా లాక్డౌన్ విధించేనాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 519గా ఉండగా 10 మంది మృతి చెందారు. లాక్డౌన్లోనూ ‘అన్లాక్ 1.0’ పేరిట జూన్ 1న కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చే నాటికి దేశంలో 1 లక్షా 70 వేల మందికి కరోనా సోకింది. ఇక జూన్ 14 నాటికి 3 లక్షల 30 వేల కేసులతో ప్రపంచంలోనే నాలుగోస్థానానికి చేరింది. రోజుకు 10వేలకు మించి కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా కేసుల ప్రస్తావన వచ్చినపుడల్లా పలు దేశాలతో పోల్చి చెబుతున్న కేంద్రం.. లాక్డౌన్ ద్వారానే కేసుల సంఖ్య తగ్గిందని సమర్థించుకుంటున్నది. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే వంటి దేశాలతో మోడీ సర్కారు పోల్చి చెబుతున్నది. కానీ ఆ దేశాల్లో కేసుల సంఖ్య పెరగడంతో కఠినంగా లాక్డౌన్ పాటించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆయా ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించాయి. ఈ దేశాల్లో ‘అన్లాక్’ చేసేనాటికి కేసుల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆ తర్వాతా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ఇటీవలే న్యూజీలాండ్ తొలి ‘కరోనా ఫ్రీ దేశం’గానూ గుర్తింపు పొందింది.
Courtesy: NT