ఉన్నావ్లో మరో ఘోరం!
అత్యాచార బాధితురాలికి నిప్పు
మంటల్లో కాలిపోతూనే కి.మీ. మేర పరుగు
అంతం చేయడానికి తెగబడిన నిందితులు
కొన ఊపిరితో ఉన్న యువతిని ప్రత్యేక విమానంలో దిల్లీకి తరలించిన ప్రభుత్వం
కాటువేసిన మిన్నాగులు తమ కోరల్లో ఇంకొంత విషం నింపుకొన్నాయి. అదను చూసి మరోసారి గరళాన్ని చిమ్మాయి. ఓ అతివ కొన ఊపిరితో విలవిల్లాడేలా చేశాయి. ఉత్తర్ప్రదేశ్లో ఈ దారుణం జరిగింది. అత్యాచార బాధితురాలిపై నిందితులు కిరోసిన్ పోసి తగలబెట్టారు. అత్యాచారాలు, హత్యలపై దేశమంతా ఆందోళనలు జరుగుతున్న తరుణంలోనే ఇది చోటు చేసుకొంది.
ఉన్నావ్ (యూపీ): మాటలకందని విషాదం. అత్యాచార బాధితురాలు ఆ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానానికి వెళ్లబోతుండగా పాత నిందితులే ఆమెను అటకాయించారు. నిలువునా నిప్పు అంటించారు. ఒకపక్క మానసిక క్షోభ, మరోపక్క శారీరక యాతనతో ఆమె కిలోమీటరు దూరం వరకు మంటలతో పరుగులు తీస్తూనే ఉంది. అప్పటికిగానీ ఆమెకు సాయం అందలేదు. 90% శరీరం కాలిపోగా ఇప్పుడు మృత్యువుతో పోరాడుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్లో నిరుడు అత్యాచారానికి గురైన యువతి తాజా పరిస్థితి ఇది. హైదరాబాద్లో పశు వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపై యావద్దేశం ఆవేదన చెందుతుండగానే.. ఉన్నావ్ బాధితురాలిని కడతేర్చడానికి ప్రయత్నం జరగడం విషాదం. ఈ సంఘటనను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు.
నాడు కాటు వేసినవారు వీరే
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్లో నివసించే బాధిత యువతి గత డిసెంబరులో అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేసిన నిందితుడు అప్పట్లో అరెస్టయి, నవంబరు 25నే బెయిల్పై విడుదలయ్యాడు. మరికొందరితో కలిసి ఆమెను మట్టుబెట్టే ప్రణాళిక రూపొందించాడు. కేసు తదుపరి విచారణలో భాగంగా రాయ్బరేలీలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బాధితురాలు గురువారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరగా నిందితులు ఆమెపై దాడిచేసి, నిప్పంటించారు. తన ఇంటికి సమీపంలోని మలుపు వద్ద హరిశంకర్ త్రివేది, రామ్కిశోర్ త్రివేది, ఉమేశ్ బాజ్పాయి, శివం త్రివేది, శుభం త్రివేది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితురాలు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చింది. వీరిలో శివం త్రివేది, శుభం త్రివేదిలే ఆమెపై అత్యాచార కేసులో నిందితులు. ఐదుగురు కలిసి చేసిన దాడిలో కాలిపోతూ, తీవ్ర గాయాలపాలై ఓ ఇంటి వద్ద ఆగి సాయం కోరగానే ఆ ఇంట్లో ఉన్న రవీంద్ర ప్రకాశ్ తొలుత ఆమెను మంత్రగత్తెగా పొరపడ్డారు. తన తండ్రి పేరును చెప్పడంతో అప్పుడు గుర్తించారు. ప్రకాశ్ మొబైల్ నుంచే ఆమె 112కి ఫోన్ చేసి విషయం తెలిపింది. కాసేపటికి అంబులెన్సుతో పాటు పోలీసులు వచ్చారు. నిందితులు ఐదుగురినీ కొన్ని గంటల్లోనే అరెస్టు చేశారు.
ముక్తకంఠంతో ఖండించిన రాజ్యసభ
ఉన్నావ్ ఘటనపై తమ వాణిని వినాలంటూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ను కాంగ్రెస్ నేత ఆనంద్శర్మ కోరారు. అనుమతి లభించకపోవడంతో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభను అరగంటపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత చర్చ సందర్భంగా ఉన్నావ్ ఘటనను సభ ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా వెన్వెంటనే కచ్చితమైన, తగిన చర్యలు తీసుకుని దేశానికి తగిన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఘటన గురించి తెలిశాక యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నానని చెప్పారు.
నివేదిక కోరిన జాతీయ మహిళా కమిషన్
బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకువెళ్లి, సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్పించారు. దిల్లీ విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి సత్వరం చేర్చడం కోసం ఆ మార్గంలో కాసేపు ఇతర వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. ఉన్నావ్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందేలా, నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. గత మూడేళ్లలో మహిళలపై జరిగిన నేరాలు, బెయిల్ పొందిన నిందితుల వివరాలతో సమగ్రంగా నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ యూపీ పోలీసు విభాగాన్ని ఆదేశించారు.
Courtesy Eenadu…