రాజవొమ్మంగి, అడ్డతీగల : ఐసిడిఎస్ను పరిరక్షించుకునేందుకు ప్రజలతో కలిసి అంగన్వాడీలు ఐక్యంగా పోరాడాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి అన్నారు. మండలంలోని జడ్డంగిలో బుధవారం ఆ సంఘం మండల కార్యదర్శి కె.వెంకటలక్ష్మి అధ్యక్షతన అంగన్వాడీ యూనియన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బేబిరాణి మాట్లాడుతూ పోరాడితేనే హక్కులు, వేతనాలు సాధించొచ్చన్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు, ఇతర బిల్లులును వెంటనే చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా తీసుకోవాలని, అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇప్పుడున్న వేతనానికి సగం వేతనం పింఛనుగా ఇవ్వాలన్నారు. ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలను ఆపాలన్నారు. నూతన విద్యావిధానంలో అంగన్వాడీ కేంద్రాల జోక్యాన్ని ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 17 నుంచి 20 వరకు రాజమహేంద్రవరంలో జరిగే ఆలిండియా అంగన్వాడీ 9వ మహాసభను జయప్రదం చేయాలన్నారు. అనంతరం మహాసభల పోస్టర్ను ఆవిష్క రించారు. అడ్డతీగల అంగన్వాడీ సెంటర్లో నిర్వహించిన సమా వేశంలోనూ బేబిరాణి పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలపట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్యంవైఖరిపై ఐక్యంగా పోరాడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల కుదింపును ఆపాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట జిల్లా ప్రధానకార్యదర్శి ఇ.చంద్రా వతి, ప్రాజెక్టు కార్యదర్శి పి.నిర్మల, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రావతి, మండల నాయకులు సిహెచ్ కుమారి, బి.కాంతం, కె.లక్ష్మి, మేరీ, సత్యవతి, పి.నిర్మల పాల్గొన్నారు.
Courtesy Prajasakthi..