– 2015, 16లో తనువు చాలించిన అన్నదాతలు
– మహారాష్ట్రలో అధికం.. మూడోస్థానంలో తెలంగాణ
న్యూఢిల్లీ : మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండేండ్లలో కలిపి దేశవ్యాప్తంగా 14,277 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెందారని కేంద్రం వెల్లడించింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందిస్తూ.. 2015లో 8,007 మంది, తర్వాతి ఏడాదిలో 6,270 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. కాగా మరణించిన వారి సంఖ్య నాటి బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. రెండేండ్లలో అక్కడ 5,580 మంది మరణించగా.. కర్నాటకలో 2,409 మంది, తెలంగాణలో 1,970, ఛత్తీస్ గఢ్లో 1,439, మధ్యప్రదేశ్లో 1,180 మంది అన్నదాతలు తనువు చాలించారు. మరోవైపు గడిచిన నాలుగేండ్లలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన డేటాను కేంద్రం విడుదల చేయలేదనీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికల్లోనూ రైతుల మరణాల గురించిన వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. దీనికి కిషన్రెడ్డి సమాధానమిస్తూ.. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతుల మరణాలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదని తెలిపారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారని రాహుల్ పేర్కొన్నారు.
(Courtesy: NT)