-కలెక్టరేట్లో పెట్రోల్ పోసుకున్న మరో రైతు
– భూ సమస్యలపై ఇద్దరు అత్మహత్యాయత్నం
మోటకొండూర్/ సూర్యాపేట కలెక్టరేట్: వరిచేను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరో రైతు ఏకంగా ఆర్టీసీ బస్సు టైర్ కింద పడుకొని ఆత్మహత్యాయత్నం చేయగా, భూ సమస్య పరిష్కరించాలని మరో రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో సోమవారం జరిగాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రానికి చెం దిన బండి నర్సయ్యకు సర్వే నెంబర్ 950లో మూడెకరాల భూమి ఉంది. అందులో 20 గుంటల భూమిని పోలీస్స్టేషన్ నూతన భవన నిర్మాణానికి ఇస్తానని అంగీకరించాడు. మిగతా భూమిలో వరి సాగు చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు వరి పంటను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నర్సయ్య సోమవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపాడు. అదే సమయంలో అక్కడికి బస్సు రాగా దాని టైర్ కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బస్సు డ్రైవర్ బస్సును నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన పెద్దారపు నాగరాజుకు గ్రామంలో సర్వే నెంబర్ 195/ఆ లో తన అమ్మమ్మ చిలకరాజు మాణిక్యమ్మ గిఫ్ట్ రూపంలో ఎకరం భూమి ఇచ్చింది. 2016లో రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. ఆ భూమికి సంబంధించిన పట్టా చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులకు గతంలో విన్నవించుకున్నాడు.
కొద్ది రోజుల కిందట కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చిన నాగరాజు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒక్కసారిగా ఒంటిపై పోసుకున్నాడు. అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది ఆయన్ను అడ్డుకొని నేరేడుచర్ల పోలీస్స్టేషన్కు తరలించారు. కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి బాధితునితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.
Courtesy: NT