కొందరికి రూ.100 లోపే జీతాలు
కొన్ని చోట్ల 25ు నుంచి 35ు వేతనాలే!
డ్యూటీలకు రిపోర్టు చేసినా గైర్హాజర్లు
అధికారుల నిర్వాకంతో భారీగా కోతలు
లబోదిబోమంటున్న ఆర్టీసీ సిబ్బంది
రాత్రి 7 తర్వాత జూన్ పూర్తి వేతనాలు
సంగారెడ్డి డిపోకు చెందిన ఒక డ్రైవర్ మూలవేతనం రూ.15,010. మామూలుగా అయితే ఆయనకు నెలకు రూ.20 వేల దాకా జీతం వస్తుంది. కానీ, జూన్ నెలకుగాను వచ్చిన జీతం.. అక్షరాలా 49 రూపాయలు! అదే డిపోకు చెందిన మరో డ్రైవర్కు వచ్చిన వేతనం.. రూ.60. రూ.30 వేల మూలవేతనం ఉన్న ఇంకో డ్రైవర్కు రూ.1600 వచ్చింది! ఇలా ఆ డిపోలో 20 మందికి రూ.100 లోపు.. 50 మందికి రూ.1000లోపు వేతనాలు వచ్చాయి! భద్రాచలం డిపో ఉద్యోగులు 483 మందిలో 400 మందిది ఇదే దయనీయ స్థితి! మేడ్చల్, మెహదీపట్నం డిపోల్లో సిబ్బందిదీ అదే వ్యధ!! అధికారుల నిర్లక్ష్యమే వారి కష్టాలకు, జీతాల్లో కోతలకు కారణం.
హైదరాబాద్: ‘అసలే మూడునెలలుగా 50 శాతం వేతనాలే ఇస్తున్నారు! జూన్నెలకు పూర్తి జీతం వస్తుంది కాబట్టి పర్వాలేదు’ ..అని ఆశపడుతున్న ఆర్టీసీ సిబ్బందిపై మరోసారి కోతల పిడుగుపడింది! మామూలు కోతలు కాదు.. కొన్ని డిపోల్లో అడ్డగోలు కోతలు కోశారు! ఈఎ్సఐ, పీఎఫ్ కటింగ్లు పోగా చేతికొచ్చిన సొమ్ము చూసుకుంటే కడివెడు దుఃఖం తప్ప మరేమీ మిగలని స్థితి!! వేతనాలు ఇచ్చినట్లే ఇచ్చి ఇలా దారుణంగా కోతలు విధించడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.కోతల గురించి ఆరా తీస్తే.. ‘మీరు విధులకు గైర్హాజరయ్యారు’ అని డిపో అధికారులు చెబుతున్నారని వారు వాపోతున్నారు. తాము డ్యూటీలకు వచ్చి రిపోర్టు చేసినా… గైర్హాజరు వేసి, ఇప్పుడు జీతాలు కట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు.. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు మార్చి 21 నుంచి ఆగిపోయాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మే 19 నుంచి జిల్లా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. 5000కు పైగా జిల్లా బస్సులను నడిపే వీలున్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ తగ్గడంతో 4000 వరకు బస్సులను తిప్పుతున్నారు.
ఈ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సైతం పూర్తి వేతనాలు ఇవ్వలేదు. ఇక బస్సులు నడవని సిటీ డిపోల్లోని సిబ్బంది సంగతి సరేసరి! భద్రాచలం డిపోలో మొత్తం సిబ్బంది 485 వరకూ ఉన్నారు. వారిలో 400 మంది సిబ్బంది వేతనాల్లో కోతలు పడ్డాయి. ఒక్కొక్కరి వేతనంలో రూ.2000-3000వరకు కోతలు పెట్టారు. పరిగి డిపోలో 80 మందికి, మేడ్చల్ డిపోలో 40 మందికి రూ.ఐదారు వేల చొప్పున కోతలు విధించారు. తాండూరు డిపోలోనూ అదే పరిస్థితి. హైదరాబాద్ జోన్లోని మెహిదీపట్నం డిపోలో 30 మందికి, మియాపూర్-1 డిపోలో 50మందికి వేతనాల్లో కోతలు పెట్టారు. ఇలా కోతలు పడడంతో 100శాతం వేతనాలిచ్చి ప్రయోజనం లేకుండా పోయిందని సిబ్బంది వాపోతున్నారు.
డిపోకు వచ్చి రిపోర్ట్ చేసినా..
జిల్లాల్లో బస్సులు పూర్తి స్థాయిలో నడవడం లేదు. అంతర్రాష్ట్ర బస్సులు కొన్ని మూలన పడగా, నడుస్తున్న బస్సుల్లో ట్రాఫిక్ లేక కొన్నింటిని రద్దు చేస్తున్నారు. దాంతో మొత్తం సిబ్బందికి విధులు కల్పించే పరిస్థితి ఉండడం లేదు. అయినా… విధులు లభించని సిబ్బంది డిపోలకు వచ్చి రిపోర్టు చేస్తున్నారు. అటెండెన్స్ చార్టులలో సంతకాలు చేస్తున్నారు. విధులు అప్పగిస్తే చేస్తామని చెబుతున్నారు. కానీ… అధికారులు మాత్రం విధులు లేవని సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఇళ్లకు పంపించేస్తున్నారు. ఇంకా కొన్ని డిపోలలో సెలవులు వాడుకోవాలంటూ సూచిస్తున్నారు. క్యాజువల్ లీవ్స్ అయిపోయిన సిబ్బందికి మాత్రం ఆబ్సెంట్ వేస్తున్నారు. ఇలాంటి గైర్హాజరును సాకుగా చూపి వేతనాల్లో కోతలు విధిస్తున్నారు.
ఇక, గ్రేటర్ హైదరాబాద్ జోన్లో సిటీ బస్సులు నడవడం లేదు. కొన్ని బస్సులను మాత్రం ఎన్ఎ్ఫసీ, బీడీఎల్ వంటి కంపెనీల సిబ్బంది కోసం, కొవిడ్-19 విధుల్లో పాల్గొంటున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కోసం నడుపుతున్నారు. వీటిలె కొంత మంది డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. మరికొంత మంది సిబ్బందిని బస్ పాస్ కౌంటర్లు, కార్గో, పార్సిల్ సేవల విభాగాల్లో సర్దారు. మిగిలిన సిబ్బందిని స్పేర్లో పెడుతున్నారు.వారు సాయంత్రం వరకు వేచి చూసి విధులు దొరకక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. నిబంధనల ప్రకారమైతే ఇలాంటివారికి పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాలి. కానీ… తాము విధులకు వచ్చినా కోతలు విఽధిస్తున్నారని వారు వాపోతున్నారు. ‘‘కోతలతో ఇచ్చిన జీతాలు నెల మొత్తం ఎలా సరిపోతాయి? అసలే ఇది పిల్లలను స్కూళ్లు, కాలేజీల్లో చేర్చాల్సిన సమయం,. ఇలాంటి సమయాల్లో కోతలు పెట్టి మాకు తీరని అన్యాయం చేస్తున్నారు’’ అని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
అలాగే కొన్ని చోట్ల డిపోల్లో ఉన్నతాధికారులకు అనుకూలంగా ఉండే అతికొద్దిమందికి మాత్రమే డ్యూటీలు వేస్తున్నట్టు సమాచారం. సంగారెడ్డి పరిధిలో ఒక ఉన్నతాధికారి ఇలాగే చేస్తున్నట్టు డిపో సిబ్బంది ఆరోపిస్తున్నారు. స్పేర్ బుకింగ్ చార్ట్లో సంతకాలు చేసినా తమకు గైర్హాజరు వేశారని మండిపడుతున్నారు. భద్రాచలం డిపోలో అయితే.. ఉన్నతాధికారులు స్పేర్ చార్టులో సంతకాలు సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ విషయం చెప్తే తమకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగులు గైర్హాజరైనట్లు చూపారని అక్కడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై భద్రాచలం ఆర్టీసీ డీఎం శ్రీనివా్సను సంప్రదించగా.. సమస్య తన దృష్టికి వచ్చిందని, సాంకేతికపరమైన లోపాల కారణంగా ఈ నెల జీతాల్లో కోతలు విధించడం జరిగిందని తెలిపారు. డిపో పరిధిలోని ఉద్యోగులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
విధులు లేవు.. వేతనాలెలా ఇస్తాం?
సిబ్బంది వేతనాల్లో కోతలపై డిపో మేనేజర్ల స్పందన కోరగా.. విధులు లేనప్పుడు వేతనాలు ఎలా ఇస్తామని అంటున్నారు. ఈ విషయంలో తమకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలున్నాయని చెబుతున్నారు. విధుల్లో పాల్గొన్నవారికే వేతనాలు ఇవ్వాలని, స్పేర్లో ఉన్నవారికి ఇవ్వకూడదన్న ఆదేశాలున్నాయని అంటున్నారు. స్పేర్లో ఉండి సెలవులు వాడుకున్నవారికి మాత్రం ఇస్తున్నామని చెబుతున్నారు. సెలవులు అయిపోయి, విధులు లభించనివారికి కోతలు తప్పడం లేదంటున్నారు.
9 రోజులు లేటుగా.. రాత్రి 7 తర్వాత
జూన్ నెలకు సంబంధించి ఉద్యోగులకు 100 శాతం జీతాలు చెల్లించడంతో ఆర్టీసీ కూడా ఆ మేరకు చెల్లించాలని నిర్ణయించింది. కానీ, చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగింది. ప్రతి నెలా 5, 6 తేదీలలోనైనా వేతనాలను అకౌంట్లలో జమ చేసేవారు. ఈసారి మాత్రం.. జూలై 9న రాత్రి 7 గంటలు దాటిన తర్వాత జమ చేశారు.
ప్రశ్నించేవారు లేకపోవడంతోనే..
ఆర్టీసీలో యూనియన్ల భాగస్వామ్యం తగ్గిందని.. దాంతో డీఎంలు, ఇతర ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్ చెప్పారు. సిబ్బంది వేతనాల్లో కోతలు పెట్టాలంటూ ఉత్తర్వులేమీ లేనప్పటికీ.. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలంలో డిపోలో 485 మందిలో 400 మందికి కోతలు విధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీలో యూనియన్ల భాగస్వామ్యం పెంచాలని డిమాండ్ చేశారు.
Courtesy AndhraJyothy