ఆర్మూర్, మే 1: అక్కడ మహిళలే హమాలీలు. నలభై కిలోల ధాన్యం బస్తాను నెత్తినెత్తుకొని మోసుకొంటూ వెళ్లి లారీల్లోకి తరలిస్తున్నారు. పురుషులే ధాన్యం బస్తాలను మోసేందుకు వెనుకడుగు వేస్తున్న తరుణంలో ధాన్యం బస్తాలను అవలీలగా లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేంగల్ సరిహద్దులోని ధనంబండ తరండా గిరిజన మహిళలు ప్రదర్శిస్తున్న చైతన్యమిది. జిల్లాలో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం బస్తాలను లారీలోకి ఎక్కించడానికి, రైస్ మిల్లు వద్ద లారీ నుంచి దించడానికి హమాలీలు దొరకడం లేదు. సాధారణంగా జిల్లాలో ఏ రైస్మిల్లులో చూసినా మహరాష్ట్ర, బిహార్కు చెందిన వారే హమాలీలుగా ఉన్నారు. లాక్డౌన్ ఉన్నందున వీరిలో చాలా మంది హమాలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానికులు హమాలీగా చేసేందుకు వెనకడుగు వేస్తుండటంతో మహిళలు ముందుకొచ్చారు. ధాన్యం బస్తాలను నింపడమే కాదు.. లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్నారు.
Courtesy Andhrajyothi