మూడేళ్లయినా తేలని వ్యవహారం
హైదరాబాద్ : టాలీవుడ్ మత్తుమందుల కేసు మూడేళ్లయినా జీడిపాకంలా సాగుతూనే ఉంది తప్ప కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. ఈ కేసు పురోగతిపై సుపరిపాలన వేదిక.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఈ నెల 1న ఆబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకూ 8 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశామని.. మిగతా వాటిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని తెలిపింది చాలా మంది సినీతారలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై వారందర్నీ పిలిచి విచారించిన కేసులో మూడేళ్లయినా దర్యాప్తు కొలిక్కి రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.
ఇలా బయటపడింది..
విశ్వసనీయ సమాచారంతో ఆబ్కారీ అధికారులు 2017 జులై 2న సికింద్రాబాద్కు చెందిన కెల్విన్ మాస్కెరాన్స్(29), చాంద్రాయణగుట్ట ఇస్మాయిల్నగర్కు చెందిన సోదరులు ఎండీ అబ్దుల్ వహాబ్(20), ఎండీ అబ్దుల్ ఖుద్దూస్ (20)లను అరెస్టు చేశారు. వీరు ఖరీదైన మత్తుమందులు దిగుమతి చేసుకొని హైదరాబాద్లో అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 700 యూనిట్ల ఎల్ఎస్డీ, 35 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా కెల్విన్ వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనం రేకెత్తించాయి. పాఠశాల విద్యార్థులు మొదలు టాలీవుడ్లో అనేక మంది ప్రముఖులకు మత్తుమందులు సరఫరా చేసేవాడినని కెల్విన్ చెప్పడంతో కలకలం రేగింది. దాంతో ఆబ్కారీ అధికారులు మొత్తం 12 మందిని రోజుకు ఒకరి చొప్పున పిలిపించి విచారించారు.
ఎనిమిది కేసుల్లోనే అభియోగపత్రాలు..
ఆబ్కారీ అధికారులు 12 కేసులు నమోదు చేయగా.. ఇప్పటి వరకూ 8 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. మొత్తం 62 మందిని విచారించారు. మత్తుమందులు సరఫరా చేసిన వారికి సంబంధించిన కేసుల్లో మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేశారు. వారు ఎక్కడెక్కడ నుంచి తెచ్చేవారు, ఎలా తయారు చేసేవారన్న విషయాలను అందులో పేర్కొన్నారు. కొందరు స్థానికంగానే మత్తుమందులు తయారు చేసినట్లు అభియోగపత్రాల్లో వెల్లడించారు. మరికొందరు నిందితులు జర్మనీ, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ నుంచి కొరియర్ ద్వారా దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా జరుగుతున్న గంజాయి, ఇతర మత్తుమందుల రవాణా వంటి అంశాలనే ఈ అభియోపత్రాల్లో ప్రస్తావించారు. వీటిలో ఎక్కడా సినీతారలకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.
సిట్ నివేదిక బయటపెట్టాలి
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలి. ఇప్పటి వరకూ అభియోగపత్రాలు దాఖలు చేసిన కేసులకు సంబంధించిన వివరాలూ బహిర్గతం చేయాలి. సినీతారులను పిలిచి విచారించడంతోపాటు వారి నుంచి నమూనాలు కూడా సేకరించారు. వారు మత్తుమందులు వాడినట్లు తేలి ఉంటుంది కాబట్టే ఆ వివరాలు బయటపెట్టడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తిచేయాలి.
Courtesy Eenadu