- 3-4 వేల రూట్లలో ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం
- రెండు, మూడు రోజుల్లో కేబినెట్ భేటీ.. ఖరారు చేసే చాన్స్
హైదరాబాద్: ‘‘నేను, రవాణా శాఖ మంత్రి ఒక్క సంతకం పెడితే.. ఒకే రోజులో ఏడు వేల ప్రైవేటు బస్సులు రోడ్డుక్కెతాయి’’… ఇటీవల ఓ భేటీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. తాజాగా ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా?అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలోని 3-4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సమ్మెపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉంది. సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావడం లేదు. ఫలితంగా డీజిల్ పోసే బంకులకు బకాయిలు పేరుకుపోయాయి.
ఏ క్షణమైనా బంకులు డీజిల్ పోయడం ఆపేయవచ్చు. దీనివల్ల ప్రస్తు తం తిరుగుతున్న బస్సులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ కూరుకుపోతున్నది. ఏ క్షణమైనా ఆర్టీసీని ఎన్పీఏగా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రేక్షక పాత్ర వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికల్-2019 ప్రకారం ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లభించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 3000-4000 రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తే ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలకు అసౌకర్యం క లగకుండా ఉండేందుకు, మెరుగైన రవాణా సౌ కర్యం కల్పించేందుకు దోహదపడతుందని భావిస్తోంది.
1000 రూట్లకు 21,453 దరఖాస్తులు
పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహనాల యజమానులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం 1,000 రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే… ఏకంగా 21,453 అప్లికేషన్లు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని వారే కాకుండా.. ఇతర రాష్ట్రాల వారు సైతం ముందుకొచ్చి బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కార్మిక సంఘాల బెదిరింపుల నుంచి విముక్తి కలగాలంటే పర్మిట్లు ఇవ్వడమే మంచిదని నిర్ణయించినట్లు తెలిసింది.
Courtesy Andhra Jyothy..