అడ్డగోలు నిర్మాణాల్లో వైద్య సేవలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నవే అధికం
ప్రమాదం జరిగితే సన్నద్ధత కరవు
సంఘటన జరిగినప్పుడే హడావిడి తర్వాత చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
రెండేళ్ల కిందట హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్ లోని ఫైన్ ఆసుపత్రిలోనూ నవజాత శిశువుల ఐసీయూలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, ఒక శిశువు మృతిచెందాడు. ఇలాంటివి జరిగినప్పుడు ఉన్నతాధికారులు తాత్కాలికంగా హడావిడి చేయడం మినహా.. ఆ తర్వాత అంతా యథావిధిగా జరిగిపోతోంది. నిబంధనలు కఠినతరంగా ఉన్నా.. ఆచరణలోకి వచ్చేసరికి అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. అపార్ట్ మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ఆసుపత్రులను నెలకొల్పుతున్నా.. జరిగిపోతోంది. నిబంధనలు కఠినతరంగా ఉన్నా.. ఆచరణలోకి వచ్చేసరికి అవన్ని కాగితాలకి పరిమితమవుతున్నాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ఆసుపత్రులను నెలకొల్పుతున్నా.. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ, పురపాలక, కార్మిక, విద్యుత్ తదితర ప్రభుత్వ శాఖల నుంచి సుమారు 15 వరకూ అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 500కి పైగా ఆసుపత్రులుండగా.. ఇందులో ఒక మోస్తరు గుర్తింపు పొందిన ఆసుపత్రులు సుమారు 320 ఉంటాయని అంచనా. వీటిలో ప్రభుత్వ ఆసుపత్రులు 75, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు 245 ఉంటాయి. వీటిలో పక్కాగా నిబంధనలను అనుసరించి నిర్వహించే ఆసుపత్రులు సగానికంటే తక్కువేనని తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇరుకిరుకు భవనాల్లో నిర్వహించేవే అత్యధికంగా – కనిపిస్తాయి. పైగా చల్లదనాన్ని అందించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేసుకోవడం సాధారణం.అంతర్గతంగా విద్యుత్ తీగలు పొందుపర్చి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడూ వాటిని పరిశీలించకపోతే.. ఏ క్షణాన అగ్నిప్రమాదం సంభవిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అగ్నిమాపక నిబంధనలివి..
* అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆర్పేందుకు అవసరమైన నీటి సరఫరాకు ఏర్పాట్లు ఉండాలి.
* ప్రతి అంతస్తులోనూ, బయటా పొడవైన పైపులను ఏర్పాటుచేయాలి.
* ప్రతి గదిలో నీటిని జల్లులా వెదజల్లే యంత్రాలను బిగించాలి.
* ప్రతి గదిలోనూ పొగను గుర్తించి, ప్రమాద హెచ్చరికను మోగించే పరికరాలను అమర్చాలి.
* భవనానికి రెండు వైపులా మెట్లను నిర్మించాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రోగులు, సిబ్బంది ఈ మెట్ల మీది నుంచి బయటకు రావడానికి వీలుగా, అందరికీ తెలిసేలా సంకేతాలను ఏర్పాటుచేయాలి.
* ఆసుపత్రి చుట్టూ అగ్నిమాపక శకటం స్వేచ్ఛగా తిరగగలిగేలా స్థలం వదలాలి.
21 ఆసుపత్రులకు తాఖీదులు : రాష్ట్రంలో ఈ ఏడాది 12 ఆసుపత్రులకు నిరభ్యంతర పత్రాలను అగ్నిమాపక శాఖ జారీచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన 21 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. వీటిల్లో ఇప్పటికే మూడింటికి హైకోర్టు జరిమానా విధించింది. మిగిలినవి విచారణలో ఉన్నాయి. అగ్నిమాపక నిబంధనలను పాటించని కారణంగా ఏడింటికి ధ్రువీకరణ అనుమతులను నిరాకరించింది.
విచారణకు కమిటీ : షైన్ పిల్లల ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం సత్వరమే స్పందించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. అదనపు సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మితో కూడిన విచారణ కమిటీ ఆసుపత్రిని సందర్శించారు. సంఘటన అనంతరం పోలీసులు ఆసుపత్రిని మూసివేయడంతో విచారణ బృందం లోనికి వెళ్లలేకపోయింది. ప్రాథమిక విచారణలో నవజాత శిశు ఐసీయూలో సంఘటన జరిగినప్పుడు వైద్యుడు లేరని బాధితులు వెల్లడించినట్లుగా తెలిసింది. ఆసుపత్రి లోనికి అనుమతించిన అనంతరం సంఘటనపై విచారణ ముందుకెళ్తుందని కమిటీ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
ఉల్లంఘనలపై కఠిన వైఖరి :ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నిబంధనలను తనిఖీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మరోసారి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోనూ అనుమతులను పరిశీలించి వారం రోజుల్లోగానివేదిక అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశాం. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ఆసుపత్రులకు నోటీసులు ఇస్తాం : ఫైన్ ఆసుపత్రి ఘటనపై విచారణ మొదలు పెట్టాం. శనివారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఆసుపత్రులతో పాటు బార్లు, పబ్బులు, పాఠశాలలకు నోటీసులు ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అగ్నిమాపక అనుమతుల విషయంపై విచారణ చేస్తాం.
Courtesy Eenadu…
Telangana,KCR, Government, hospitals, no, safety,measures, administration,lapses, patients,suffering