తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు
హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో క్షౌరశాలలు మూతపడటంతో దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్న నాయీబ్రాహ్మణులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో వివవరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న సహాయ, సహకారాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీచేసింది. లాక్డౌన్ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు ఉపాధి కోల్పోయారని పేర్కొంటూ నాయీబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు బుద్ధారం ధనరాజ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కు లేఖ రాశారు. ఈ లేఖను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది.
రాష్ట్రంలోని జిల్లాల నుంచి నగరానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు దినసరి వేతనాలకు సెలూన్లలో పనిచేస్తూ జీవిస్తున్నారని, లాక్డౌన్తో ఉపాధిని కోల్పోయారని ధన్రాజ్ పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఆధార్కార్డు ఉన్నప్పటికీ ఆర్థిక సహాయం అందించడం లేదని లేఖలో కోర్టుకు తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి, వలస కార్మికులకు ప్రభుత్వం మనిషికి 12 కిలోల బియ్యం పంపిణీ చేసిందని, కుటుంబానికి రూ.1500 కూడా ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు. అలాగే నాయీ బ్రాహ్మణులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.
దివ్యాంగులకు పాస్లు ఇవ్వండి
కృత్రిమ అవయవాలున్న దివ్యాంగులకు, వారి సహాయకులకు లాక్డౌన్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రత్యేక పాస్లు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది కె.శివగణేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కౌటూరి పవన్కుమార్ వాదించారు. కృత్రిమ అవయవాలున్న దివ్యాంగులు రెండేళ్లకోసారి వాటిని మార్చుకోవాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఈనేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లేందుకు దివ్యాంగులకు, వారి సహాయకులకు లాక్డౌన్లో ప్రత్యేక పాస్లు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు సమకూర్చే స్వచ్ఛంద సంస్థల వివరాలు కోర్టు ముందుంచాలని పిటిషినర్ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.