– ఈ ఏడాదిలో తగ్గిన బడ్జెట్
– కేటాయించిన నిధులనూ ఖర్చు చేయని వైనం
– బీసీ సంక్షేమంపై 2019 రౌండప్
బీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. నాటి నుంచి నేటి వరకు బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధులను సైతం పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలల ఏర్పాటు మినహాయిస్తే ఈ ఏడాదిలో బీసీ సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2019-20 బడ్జెట్లో రూ.4,420 కోట్లు కేటాయించింది. అందులో నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు కేవలం రూ. 786 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అదికూడా బీసీ గురుకులాల పాఠశాలల నిర్వహణ కోసమే గమన్హాం.
హామీలు గాలికి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక రకాల సంక్షేమ పథకాలు, రాయితీలను సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఫెడరేషన్ల ద్వారా ఒక్కో వృత్తిదారునికి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందజేస్తామని ప్రకటించింది. దీంతో 11 ఫెడరేషన్ల నుంచి సుమారు 5.70 లక్షల మంది నిరుపేద బీసీలు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు.
రూ.200 కోట్లు విడుదల చేసినా..
గత ఏడాది బీసీ రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు విడుదల చేసింది. కానీ అందులో నుంచి 200 మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. నామమాత్రంగా అత్యంత వెనుకబడ్డ 30 కుటుంబాలకు రూ. 50,000 వేల చొప్పున రుణాలు అందజేసి చేతులు దులుపుకు న్నది. రుణాల కోసం బీసీలు ఇప్పటికీ బీసీ సంక్షేమం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఫెడరేషన్లదీ అదే పరిస్థితి
ఫెడరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. దాంతో రజక ఫెడరేషన్కు 6,987 దరఖాస్తులు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషకు 17,668, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్కు 13,422, వడ్డెర ఫెడరేషన్ నుంచి6,720, కుమ్మరి.. శాలివాహనకు 6161, వాల్మీకి..బోయకు 6028, గీత కార్మిక కార్పొరేషన్కు 5671, పూసల ఫెడరేషన్కు 2297, భట్రాజు ఫెడరేషన్కు 235 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పినా నేటికి అమలుకు నోచుకోలేదు.
ప్రస్తుతం ఆయా 11 బీసీ ఫెడరేషన్లలో సుమారు 1.60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా మార్జిన్ మనీ కింద ఒక్కో సభ్యుడు బ్యాంకుల్లో లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. వీటికి తోడుగా ఒక్కో సభ్యుడికి ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సీడి నిధులు విడుదల చేయాల్సి ఉంది. కాని ఇప్పటికీ సబ్సిడీని విడుదల చేయలేదు. అప్పులు తెచ్చి బ్యాంకుల్లో లక్షల రూపాయలు వృత్తిదారులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బులను ప్రభుత్వం వాడుకుందనే విమర్శలున్నాయి.
రజకులు, నాయిబ్రాహ్మణులకు మొండి చెయ్యి
రజకులు, నాయి బ్రాహ్మణులకు బడ్జెట్లో కేటాయింపులే తప్ప ఖర్చు చేయలేదు. ఈ రెండు కుల వృత్తులకు సంబంధించి నాలుగువేలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్కో సొసైటీకి రూ.30లక్షలు రుణాలు ఇస్తామమని ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులు ముందుకు రాకపోవడంతోటి ఈ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. అదేవిధంగా దోభీ ఘాట్ల కోసం కేటాయించిన నిధులు నేటి ఖర్చు చేయలేదు. కొత్తగా ప్రభుత్వం ఆధునిక లాండ్రి మిషన్లు, సరి సెలూన్లు ఏర్పాటుకు వివిధ సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. గ్రామీణ పట్టణ, నగర ప్రాంతాల్లో గ్రూపు వారీగా వ్యక్తిగతంగా మిషనరీ లాండ్రీస్ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది కూడా ఆచరణకు నోచుకోలేదు.
(Courtesy: NT)