-కొలువుపోయి ప్రయివేటు ఉపాధ్యాయుల పాట్లు
– కొందరు పొలానికి.. మరికొందరు రోజువారీ కూలీలు
– గ్రేటర్ హైదరాబాద్లో సేల్స్మెన్లుగా అవతారం
– ఎక్కడచూసినా బరువెక్కిన హృదయాలు, నిట్టూర్పులు
ఉన్నత చదవులు చదివి ఆత్మాభిమానంతో గడిపిన క్షణాలు కరోనా ధాటికి ఆవిరైపోయాయి. నలుగురితో నమస్కారాలు అందుకున్న అనుభవం గలవారు నేడు కూలీలు మారిపోయారు. లాక్డౌన్ దెబ్బతో ఒక్కసారిగా చిన్నాభిన్నమైన ప్రయివేటు టీచర్లు పొలం గట్లు, బయట మార్కెట్లో దినసరి కూలీలుగా దర్శనమిస్తున్నారు. కొందరు కుటుంబ వృత్తిలోకి వెళ్తుండగా.. మరికొందరు తెలిసీ తెలియని పనుల్లో భారంగా గడుపుతున్నారు. కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రయివేటు టీచర్ల బతుకుల్లోకి తొంగిచూస్తే..
బరువెక్కిన హృదయాలు, నిట్టూర్పులు, నిర్వేదాలు.ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు నాలుగు నెలలుగా మూతపడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లు, అధ్యాపకులు విలవిల్లాడిపోతున్నారు. ఉపాధి, వేతనాల్లేక కుటుంబ పోషణకు దిక్కులు చూసే పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయం లేక రైతు కూలీలుగా, ఉపాధి హామీ కార్మికులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నవతెలంగాణ’ కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయగా కొందరు కుటుంబ వృత్తుల్లోకి మళ్లుతున్నారు. సొంత భూమి లేనివారు కూలీగా మారక తప్పడం లేదు. కరీంనగర్లో దాదాపు 8వేల మందిలో 60శాతంపైగా వివిధ రకాల పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళా ఉపాధ్యాయులు టైలరింగ్, హోం ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏండ్ల పాటు పనిచేసిన సీనియర్ ఉపాధ్యాయులూ ఉండటం గమనార్హం. సుమారు వెయ్యి మంది వరకు ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ట్యూటర్లుగా మారారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1238 ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 17,981 మంది జీవితాలను కరోనా చిదిమేసింది. పొట్టకూటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆటో రిక్షా కార్మికులు, బిర్యాని స్టాల్ పాయింట్ నిర్వాహకులుగా అనువైన పనులు చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిపి 2200 మంది ఉన్నారు. వాళ్లలో సగం మంది వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోగా మిగిలినవారు ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కారు డ్రైవింగ్, వ్యవసాయం, వ్యాపారం, ప్రయివేట్ చిట్ ఫండ్స్ వంటి వ్యాపకాల్లో చేరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1700 మంది ప్రయివేటు లెక్చరర్లు ఉండగా టీచింగ్ వృత్తినే నమ్ముకున్నారు. నేడు దర్జీలుగా, పాల కేంద్రాల నిర్వాహకులుగా, బ్రాహ్మణులు అర్చకులుగా చేస్తున్నారు. అధ్యాపకుడు సదానందంగౌడ్ 15ఏండ్లుగా లెక్చరర్గా కొనసాగుతుండగా ఐదు నెలలుగా జీతం లేక ఆయన భార్య బ్యూటీ పార్లర్ నడుపుతూ ఇల్లు నెట్టుకొస్తోంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన రేణు, వాసు పాల కేంద్రం నడుపుతూ బతుకు బండి సాగిస్తున్నారు. జనగామ జిల్లాలో ఓ ఉపాధ్యాయుడికి రూ.20 వేలు జీతమైనా ప్రస్తుతం కారం పొడి అమ్ముకుంటున్నాడు. అదే జిల్లాలో మరో టీచర్కు రూ.50 వేలు వేతనమైనా కిరాణాషాప్ పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 20వేలమంది పూట గడవక బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్లో సేల్స్మెన్స్..
హైదరాబాద్ పరిధిలో 48వేల మంది టీచర్లు, ప్రయివేటు అధ్యాపకులు 12 వేల మంది వరకుంటారు. అరకొర జీతాలతోనే అద్దెల భారం భరించుకుంటున్నారు.కరోనా వల్ల ఉపాధికి దూరమై రేషన్ బియ్యం తినే దుస్థితి ఎదుర్కొంటున్నారు. డిగ్రీ, ఎంబీఏ, అంతకన్నా పైచదువులు చదివిన చాలామంది సీనియర్ టీచర్లు పెట్రోల్ బంకుల్లో, మెడికల్ షాపుల్లో, డిమార్టు వంటి దుకాణాల్లోకి కూలీకి వెళ్తున్నారు. సేల్స్మెన్లుగా.. ఇంకొందరు కూరగాయల వ్యాపారులుగా అవతారమెత్తారు. కొన్ని చిన్న కాలేజీలు 50శాతం జీతాలు చెల్లిస్తున్నా.. పెద్దపెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం నో వర్క్ నోపే విధానాన్ని అమలు చేస్తున్నాయి. బాబానగర్కు చెందిన నిజాముద్దీన్ ఐదేండ్ల అనుభవం ఉన్నప్పటికీ ఆదాయం లేక నగరంలో శానిటైజర్లు విక్రయిస్తూ రోజుకు రూ.400-500 సంపాదించడం పలువురిని కదలించింది.
భార్యాపిల్లల్ని బతికించుకునేందుకు..: వేల్పుల శ్రీరాములు, బాల్కొండ
పాఠశాలు మూసివేయడంతో నాలుగు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ భారంగా మారింది. భార్యా పిల్లల్ని బతికించుకునేందుకు రోజువారి కూలీగా ప్రస్తుతం ఒక వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్నా. పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలి.
బైక్ మెకానిక్ వద్ద కూలీగా : ఫాసిఖాన్, ముప్కాల్
ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాక పదేండ్లుగా ప్రయివేటు స్కూల్లో పాఠాలు చెబుతున్నా. కరోనా పుణ్యమాని బైక్ మెకానిక్ వద్ద కూలీగా చేరి, వచ్చిన జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న. ప్రయివేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను సర్కారే కనికరించాలె.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన తడకమళ్ల సురేష్ ఎంఏ, టీపీటీ చేశాడు. 14 ఏండ్ల అనుభవం. సర్కారు కొలువులు రాక ప్రయివేటు టీచర్గా పనిచేసుకుంటు న్నాడు. కరోనా వల్ల నాలుగు నెలలుగా వేతనం లేక పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబ పోషణ కోసం పార పట్టి వ్యవసాయ కూలీగా మారాడు. ఇంతకాలం వ్యవసా యం తెలియదని, పనిచేయడం ఇబ్బందిగా ఉన్నదని వాపోయాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోడిస్తే రూ.500 వస్తున్నట్టు చెప్పాడు.
Courtesy: NT