– ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్లో కొనసాగిన ఆందోళనలు
– యూపీలో పలు చోట్ల ఇంటెర్నెట్ సర్వీసులు నిలిపిివేత
దేశవ్యాప్తంగా నిర్బంధాలు, కేసులు- సీఏఏపై అవాస్తవాలు:ప్రధాని
న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో ‘పౌర’ నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. అనేక చోట్ల సీఏఏ హింసాత్మక ఘటనలపై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లో అధికార కాంగ్రెస్.. వివాదాస్పద సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది దాకా పాల్గొన్నారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరాఖండ్లలోనూ ఆందోళనలు కొనసాగాయి. యూపీలోని పలు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ ఇంటర్నెట్ బంద్తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ధర్నాలు, నిరసనప్రదర్శనలు కొనసాగాయి. జంతరమంతర్ వద్ద పలు ఆందోళనా కార్యక్రమాలు జరిగాయి. అలకనంద ప్రాంతంలో ప్రజలు… జేఎంఐ విద్యార్థులకు మద్దతుగా ర్యాలీని నిర్వహించారు. సీఏఏను రద్దుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో జేఎంఐ విద్యార్థులు కొందరు పాల్గొన్నారు. సీఏఏను వెనక్కి తీసుకోకపోతే.. కేంద్ర హౌం మంత్రి అమిత్షాను కోల్కతా ఎయిర్పోర్టులో అడుగుపెట్టనివ్వబోమని పశ్చిమ బెంగాల్ మంత్రి, జమైత్-ఉలెమా-ఎ-హింద్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిఖుల్లా చౌదరీ హెచ్చరించారు.
తమిళనాడులో సీపీఐ(ఎం), ఇతర ఇస్లామిక్ సంస్థలకు చెందిన కార్యకర్తలు, మద్దతుదారులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. చెపాక్లో ప్లకార్డులు చేతబట్టుకొని సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు.
యూపీలోని 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అధికారులు ఇప్పటికీ నిలిపివేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులపై పోలీసుల కాల్పుల్లో రణరంగమైన యూపీలోని బిజ్నోర్ను కాంగ్రెస్నాయకురాలు ప్రియాంక గాంధీ సందర్శించారు. ఇక్కడ ఖాకీ తూటాలకు ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనలతో అట్టుడికిన లక్నోను సందర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుల బృందాన్ని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. హింసను ప్రేరేపించారని పేర్కొంటూ యూపీ సీఎం సొంత నియోజకవర్గం గోరఖ్పూర్లో 50 మందిని పోలీసులు గుర్తించారు. మీరట్లో సీఏఏ నిరసనల్లో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరుకున్నది. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద 250 మందిపై కేసు నమోదుకు యూపీ పోలీసులు సిద్ధపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 250 మందిని కస్టడీలోకి తీసుకున్నామనీ, 70 మందిని జైలుకు పంపామని యూపీ సర్కార్ తెలిపింది.
మంగళూరు పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరు జలీల్, నౌషీన్ లను నిందితులుగా పేర్కొంటూ నగర పోలీసులు ఎఫ్ఐఆర్లో వారి పేర్లను చేర్చడం చర్చనీయాంశమైంది. ఇక్కడ పోలీసులు కొన్ని గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. బీహార్లో ఆర్జేడీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. హరిద్వార్లో నిరసనల నేపథ్యంలో ఉత్తరాఖండ్లో హైఅలర్ట్ను ప్రకటించారు. పౌరసత్వ చట్టంలో ముస్లింలను కూడా చేర్చాలంటూ పంజాబ్లోని ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ భాగస్వామి శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేసింది. ప్రతిపాదిత ఎన్నార్సీపై ఎన్డీయే సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని దాని మిత్రపక్షం జేడీయూ అభ్యర్థించింది. ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలతో ఢిల్లీ-గురుగ్రాం బోర్డర్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
సీఏఏపై పుకార్లు..అవాస్తవాలు : ప్రధాని మోడీ
సీఏఏ, ఎన్నార్సీ విషయంలో దేశవ్యాప్తంగా పుకార్లు, అవాస్తవాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా తీవ్ర అల్లర్లు, నిరసనలు వెల్లువెత్తినప్పటికీ వాటిపై ఇప్పటి వరకూ మాట్లాడని మోడీ తొలిసారిగా స్పందించారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు… ఎన్నార్సీ అంశంపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చా జరగలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము అసోంలో దీనిని అమలుచేయబోతున్నట్టు చెప్పారు. హింసాత్మక నిరసనలు ఆయన తప్పుబట్టారు.
రాజస్థాన్లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ
రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ‘సంవిధాన్ బచావో ర్యాలీ’ పేరుతో భారీ నిరసన ప్రదర్శనను శాంతియుతంగా నిర్వహించారు. పౌరసత్వ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్నార్సీ లను రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ర్యాలీలో సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్, ఆర్ఎల్డీ, జేడీ(ఎస్) పార్టీలకు చెందిన నాయకులు, పౌర, ముస్లిం సంఘాలకు చెందిన సభ్యులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. జైపూర్లోని చారిత్రక ఆల్బర్ట్ హాల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర ‘సైలెంట్మార్చ్’ ను నిర్వహించారు.
Courtesy Nava telangana